Plane: నేపాల్ లో కూలిన విమానం గతంలో విజయ్ మాల్యాదట!

  • నిన్న నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం
  • పలు చేతులు మారిన విమానం
  • 2007లో విజయ్ మాల్యా కొనుగోలు
  • దీన్ని థాయ్ లాండ్ సంస్థ నోక్ ఎయిర్ కు అమ్మేసిన మాల్యా
  • 2019లో యెతి ఎయిర్ లైన్స్ కొనుగోలు
Nepal crashed plane once owned by Vijay Mallya

నేపాల్ లో నిన్న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. యెతి ఎయిర్ లైన్స్ కు చెందిన 9ఎన్-ఏఎన్సీ ఏటీఆర్-72 విమానం నేపాల్ లోని పొఖారా ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే క్రమంలో కూలిపోయింది. నలుగురు సిబ్బంది, 68 మంది ప్రయాణికులు మృతి చెందారు. కాగా, ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది. 

ఇది పాత విమానం. గతంలో ఈ విమానం యజమాని కింగ్ ఫిషర్ సామ్రాజ్య అధినేత విజయ్ మాల్యా అట. సిరియమ్ ఫ్లీట్స్ డేటా ఈ మేరకు వెల్లడించింది. ఈ విమానాన్ని 2007లో విజయ్ మాల్యా కొనుగోలు చేశాడని, ఆ తర్వాత దాన్ని థాయ్ లాండ్ కు చెందిన నోక్ ఎయిర్ కొనుగోలు చేసిందని సిరియమ్ ఫ్లీట్స్ డేటా వివరించింది. అనంతరం 2019లో ఈ విమానాన్ని నేపాల్ కు చెందిన యెతి ఎయిర్ లైన్స్ కొనుగోలు చేసిందని తెలిపింది. 

ఈ ఏటీఆర్-72 విమానం రెండు ఇంజిన్ల టర్బోప్రాప్ కేటగిరీకి చెందినది. షార్ట్ హాల్ కలిగిన ఈ విమానాన్ని ఏటీఆర్ సంస్థ ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో అభివృద్ధి చేసింది. ఫ్రాన్స్ కు చెందిన ఏరోస్పేషియాలే, ఇటలీ విమానయాన కూటమి ఏరిటేలియా సంయుక్తంగా ఈ విమాన రూపకల్పనలో పాలుపంచుకున్నాయి. 

కాగా, ఏటీఆర్-72లోని 72 అనే సంఖ్య ఇందులోని సీటింగ్ సామర్థ్యాన్ని సూచిస్తుంది. నేపాల్ లో ఈ తరహా విమానాలను కేవలం బుద్ధా ఎయిర్, యెతి ఎయిర్ లైన్స్ సంస్థలు మాత్రమే కలిగి ఉన్నాయి. కాగా, సాంకేతిక లోపాలే నిన్నటి విమాన ప్రమాదానికి కారణం అని కథనాలు వస్తున్నాయి. బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషిస్తే ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More Telugu News