Tamilnadu: తమిళనాడులో పోస్టర్ల కలకలం.. గవర్నర్ తీరుపై ‘గెటవుట్ రవి’ అంటూ నిరసన

  • అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై అధికారపక్షం అభ్యంతరం
  • ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో మార్పులు చేశారని ఆరోపణ
  • గవర్నర్ ఆర్.ఎన్.రవికి వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ తీర్మానం
  • సభ నుంచి కోపంగా వెళ్లిపోయిన గవర్నర్
DMK puts Get out Ravi Posters in Tamil Nadu

తమిళనాడులో గవర్నర్ ఆర్.ఎన్.రవికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. గెటవుట్ రవి అంటూ డీఎంకే నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టర్లు అతికించారు. సోమవారం అసెంబ్లీలో గవర్నర్ తీరును తప్పుబట్టారు. రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని అవమానించేలా ప్రవర్తిస్తున్నారని అధికారంలోని డీఎంకే పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోనూ ఇదే స్లోగన్‌తో హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ ఆర్.ఎన్.రవి ప్రసంగంపై అధికార పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాపీలో కొన్నింటిని వదిలేసి, మరికొన్ని అంశాలను చేర్చి చదివారని సీఎం స్టాలిన్ విమర్శించారు. లౌకికవాదంతోపాటు పెరియార్, అంబేద్కర్‌, కె.కామరాజ్‌, అన్నాదురై, కరుణానిధి తదితరుల పేర్లను గవర్నర్ ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టారు. సభలో గవర్నర్ ప్రసంగిస్తున్నంతసేపు డీఎంకే నేతలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. 'బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను ఇక్కడ రుద్దొద్దు, దయచేసి తమిళనాడు వదిలి వెళ్లిపోండి' అంటూ నినాదాలు చేశారు.

గవర్నర్ ప్రసంగం పూర్తిచేసి కూర్చోగానే సీఎం స్టాలిన్ లేచి గవర్నర్ కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. గవర్నర్ చదివిన ప్రసంగం కాకుండా సభకు ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాపీని రికార్డుల్లో నమోదు చేయాలని స్పీకర్ ను కోరారు. సీఎం స్టాలిన్ ఈ తీర్మానం చదువుతుండగానే గవర్నర్ ఆర్.ఎన్.రవి కోపంతో సభలో నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

More Telugu News