Team India: నేడే మూడో టీ20.. సిరీస్ నెగ్గాలంటే భారత్ చేయాల్సింది ఇదే!

  • రాజ్ కోట్ లో ఈ రోజు రాత్రి భారత్, శ్రీలంక చివరి మ్యాచ్ 
  • చెరో మ్యాచ్ గెలిచి 1–1తో సమంగా ఉన్న ఇరు జట్లు
  • బౌలింగ్, టాపార్డర్ మెరుగైతేనే భారత్ కు విజయావకాశాలు
3rd T20I today Bowling woes top order wobbles bother India

భారత్, శ్రీలంక చెరో మ్యాచ్ లో గెలిచి 1–1తో సమంగా ఉన్న మూడు టీ20ల సిరీస్ లో విజేత ఎవరో తేలిపోయే సమయం ఆసన్నమైంది. శనివారం రాత్రి రాజ్ కోట్ లో జరిగే చివరి పోరులో ఇరు జట్లూ అమీతుమీకి రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాయి. వాంఖడే లో తొలి మ్యాచ్ లో రెండు పరుగుల తేడాతో గట్టెక్కిన టీమిండియా గత పోరులో బౌలింగ్‌తో పాటు టాపార్డర్ వైఫల్యం కారణంగా ఓటమి కొని తెచ్చుకుంది. ముఖ్యంగా యువ బౌలర్ల నిలకడలేమి జట్టును దెబ్బకొట్టింది. పేసర్‌ అర్ష్‌ దీప్‌ రెండు ఓవర్ల స్పెల్‌లో ఐదు నో బాల్స్‌ వేసి విమర్శల పాలయ్యాడు. శివం మావి, ఉమ్రాన్‌ మాలిక్‌ కూడా చెరో నో బాల్‌ వేయడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా స్లాగ్‌ ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చుకోవడం జట్టును ముంచింది.

ఇక ఇప్పుడు భారత్ సిరీస్ నెగ్గాలంటే బౌలర్లు తక్షణం గాడిలో పడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రెండు మ్యాచ్ ల్లో నిరాశ పరిచిన టాపార్డర్ కూడా సత్తా చాటాల్సి ఉంటుంది. గత రెండు ఇన్నింగ్స్‌ల్లో 7,5 స్కోర్లు చేసిన యువ ఓపెనర్ శుభ్ మన్  గిల్‌ ఈ మ్యాచ్ లో సత్తా చాటకపోతే జట్టులో అతను చోటు కోల్పోవాల్సి ఉంటుంది. ఇషాన్ కిషన్ కూడా శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది.
 
సంజు శాంసన్‌ గాయపడటంతో టీ20 అరంగేట్రం అవకాశం దక్కించుకున్న రాహుల్‌ త్రిపాఠి రెండో టీ20లో దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అయినా అతను సత్తా చాటుతాడేమో చూడాలి. మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో రాణిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్ లోనూ జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. టాపార్డర్ సత్తా చాటి సూర్యకుమార్, అక్షర్ పటేల్ అదే జోరు కొనసాగిస్తే భారత్ కు తిరుగుండదు.

More Telugu News