Balakrishna: బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' ప్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతిని నిరాకరించిన ఏపీ పోలీసులు

  • ఈ నెల 12న రిలీజ్ అవుతున్న 'వీరసింహారెడ్డి'
  • 6వ తేదీన ఒంగోలులో ప్రీరిలీజ్ ఈవెంట్ కు సన్నాహకాలు
  • కార్యక్రమాన్ని ఒంగోలు బయట పెట్టుకోవాలన్న పోలీసులు
Permission rejected for Balakrishna Veerasimha Reddy movie

సంక్రాంతి కానుకగా బాలకృష్ణ తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రం యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 6న ఒంగోలులో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని నిర్ణయించారు. స్థానికంగా ఉన్న ఒక గ్రౌండ్ లో ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇంతకు ముందు ప్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతిని ఇచ్చిన పోలీసులు ఇప్పుడు అనుమతిని నిరాకరించారు. 

ప్రీరిలీజ్ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉందని... దీంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కార్యక్రమ వేదికను ఒంగోలుకు వెలుపల నిర్వహించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో గతంలో మహానాడు జరిగిన ప్రాంతంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని యూనిట్ భావిస్తోంది. మరోవైపు ఈవెంట్ కు అనుమతిని నిరాకరించడంపై బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు.

More Telugu News