Drunk man: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన మందుబాబు!

  • న్యూయార్క్-న్యూఢిల్లీ విమానంలో జరిగిన ఘటన
  • లైట్లు ఆర్పేసి ఉన్న సమయంలో మహిళపై మూత్ర విసర్జన
  • ఓ జత డ్రెస్ ఇచ్చి మార్చుకోవాలని సూచించిన క్యాబిన్ క్రూ సిబ్బంది
Drunk man urinates on female passenger in business class of Air India flight

పీకల దాకా మద్యం సేవించిన వ్యక్తి ఎయిర్ ఇండియా ఫ్లయిట్ లో ఓ అసహ్యకరమైన పని చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడగా, ఎయిర్ ఇండియా సైతం ఇది నిజమేనని అంగీకరించింది. నవంబర్ 26న జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే..

న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లయిట్ ఏఐ102, బిజినెస్ క్లాస్ లో ఓ సీనియర్ సిటిజన్ మహిళ ప్రయాణిస్తోంది. విమానంలో లైట్స్ ను ఆఫ్ చేసిన తర్వాత.. అదే తరగతిలో ప్రయాణిస్తున్న ఓ తాగుబోతు వ్యక్తి లేచి సదరు మహిళ సీటు వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత కూడా అతడు అక్కడే నిలుచుని ఉండడంతో, తోటి ప్యాసింజర్ ఒకరు అక్కడి నుంచి వెళ్లాలని కోరాడు. 

ఈ చెత్త పని గురించి సదరు బాధిత మహిళ నేరుగా టాటా గ్రూపు చైర్ పర్సన్ చంద్రశేఖరన్ దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన ఘటన పట్ల క్యాబిన్ క్రూ సిబ్బందిలో ఏ మాత్రం చలనం లేదని, ఓ జత పైజామా ఇచ్చి మార్చుకోవాలని సూచించారే కానీ, సదరు ప్యాసింజర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ ఘటన గురించి పోలీసు, నియంత్రణ సంస్థకు తెలియజేశామని, సదరు బాధిత మహిళతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. విచారణ అనంతరం నిందితుడిపై తగిన చర్య తీసుకుంటామని ప్రకటించింది. సదరు ప్రయాణికుడిని నో ఫ్లై జాబితా (నిషేధిత జాబితా) లో చేర్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

More Telugu News