Jagan: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ ఫలప్రదంగా సాగింది: విజయసాయిరెడ్డి

CM Jagan met PM Modi in Delhi
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఈ మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ఏపీ పురోగతి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ సానుకూల రీతిలో ఫలప్రదంగా సాగిందని వివరించారు. ఏపీ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను సీఎం జగన్ ఈ సమావేశంలో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారని వెల్లడించారు. 

కాగా, ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా.... ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. 

అపరిష్కృతంగా ఉన్న విభజన హామీలను కూడా సీఎం జగన్ ప్రస్తావించారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ బకాయిలు ఇంకా చెల్లించలేదని తెలిపారు. గత సర్కారు పరిమితికి మించి చేసిన రుణాలను కేంద్ర ఆర్థికశాఖ ఈ ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తోందని, కేటాయించిన రుణపరిమితిలో సైతం కోతలు విధిస్తోందని వివరించారు. 

తమ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయకపోయినా, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఇలాంటి ఆంక్షలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, దీనిపై జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు. 

అటు, పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.2,937 కోట్లు ఖర్చు చేసిందని, దీనికి సంబంధించిన చెల్లింపులు రెండేళ్లుగా జరగడంలేదని తెలిపారు. అంతేకాకుండా, తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన రూ.6,886 కోట్ల విద్యుత్ బకాయిలను కూడా తక్షణమే ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. 

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో మొత్తం జిల్లాల సంఖ్య 26కి చేరిందని, రాష్ట్రంలో 14 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయని, జనాభా రీత్యా మిగిలిన 12 జిల్లాలకు కూడా మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని అన్నారు. కాగా, సీఎం జగన్ ఈ రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు.
Go Back to Shorts
Jagan
Narendra Modi
New Delhi
YSRCP
Andhra Pradesh

More Telugu News