Pavel Antov: పుతిన్ పై తరచుగా విమర్శలు చేసే రష్యా ఎంపీ ఒడిశాలో మృతి

  • ఒడిశాలోని రాయగడలో ఘటన
  • ఓ హోటల్ లో బస చేసిన నలుగురు రష్యన్లు
  • ఈ నెల 22న వ్లాదిమిర్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి
  • తాజాగా ఎంపీ పావెల్ ఆంటోవ్ మరణం
Putin critic Pavel Antov died in Odisha

మాంసం ఉత్పత్తుల వ్యాపార దిగ్గజం, రష్యా ఎంపీ పావెల్ ఆంటోవ్ భారత్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. పావెల్ ఆంటోవ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను తీవ్రంగా విమర్శించే నేతగా గుర్తింపు పొందారు. అయితే, ఒడిశాలోని రాయగడలో ఓ హోటల్ మూడో అంతస్తు నుంచి పడిపోయి ఆయన ప్రాణాలు విడిచారు. తన గది కిటీకి నుంచి ఆయన కిందపడిపోయినట్టు భావిస్తున్నారు. 

రెండ్రోజుల కిందట ఇదే హోటల్ లో పావెల్ ఆంటోవ్ స్నేహితుడు వ్లాదిమిర్ గుండెపోటుతో మరణించగా, ఇప్పుడు ఆయన కూడా మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. మిత్రుడి మరణాన్ని భరించలేక పావెల్ ఆంటోవ్ హోటల్ మూడో అంతస్తులో ఉన్న తన గది నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. ఆయనకు గైడ్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆంటోవ్ మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. 

ఈ నెల 21న నలుగురు రష్యన్ జాతీయులు ఢిల్లీ నుంచి రాయగఢ వచ్చారు. వారిలో వ్లాదిమిర్, పావెల్ ఆంటోవ్ కూడా ఉన్నారు. వారు ఢిల్లీ నుంచి వచ్చే సమయానికి మద్యం మత్తులో ఉన్నట్టు హోటల్ సిబ్బంది తెలిపారు.

More Telugu News