AAP: ఢిల్లీ మేయర్ ఆప్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్!

  • తొలిసారి కౌన్సిలర్ గా గెలుపొందిన షెల్లీ
  • గతంలో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ గా పని చేసిన వైనం
  • డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మొహమ్మద్ ఇక్బాల్
Shelly Oberoi

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా తమ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఆప్ ప్రకటించింది. మేయర్ గా షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ గా మొహమ్మద్ ఇక్బాల్ పేర్లను పేర్కొంది. కౌన్సిలర్ గా షెల్లీ ఒబెరాయ్ తొలిసారి గెలుపొందారు. అంతకు ముందు ఆమె ఢిల్లీ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేశారు. ఢిల్లీ మేయర్ గా మహిళకు అవకాశం ఇస్తామని ఇంతకు ముందే ఆప్ ప్రకటించింది. చెప్పిన విధంగానే షెల్లీని ఆ పదవికి ఎంపిక చేసింది. 

ఇక డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఇక్బాల్ విషయానికి వస్తే... ఆప్ నేత, ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన షోయబ్ ఇక్బాల్ కుమారుడు ఆయన. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన 17 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 250 స్థానాలకు గాను ఆప్ 134 స్థానాలను కైవసం చేసుకోగా... బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ కేవలం 4 సీట్లకే పరిమితం అయింది.

More Telugu News