BF-7: భారత్ లోనూ బీఎఫ్-7 కరోనా వేరియంట్... అప్రమత్తమైన కేంద్రం

  • చైనాలో కుప్పలుతెప్పలుగా కొత్త కేసులు
  • మోగుతున్న మృత్యుఘంటికలు
  • చైనాలో వ్యాప్తికి బీఎఫ్-7 వేరియంట్ కారణమని గుర్తింపు
  • భారత్ లోనూ మూడు బీఎఫ్-7 కేసులు
  • అక్టోబరులోనే తొలి కేసు నమోదు
  • దేశంలో పెరుగుదల లేదన్న కేంద్రం
BF 7 Corona Variant found in India

చైనాలో కరోనా మహమ్మారి మరోసారి మృత్యుఘంటికలు మోగిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో భారీ సంఖ్యలో నమోదవుతున్న కొత్త కేసులకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 కారణం అని గుర్తించారు. 

చైనాను వణికిస్తున్న ఆ బీఎఫ్-7 వేరియంట్ భారత్ లోనూ వ్యాపిస్తోంది. బీఎఫ్-7 వేరియంట్ తో ఇప్పటిదాకా భారత్ లో మూడు కేసులు నమోదయ్యాయి. వీటిలో మొదటి కేసు అక్టోబరులోనే గుజరాత్ లో వెలుగు చూసింది. గుజరాత్ బయోటెక్నాలజీ సెంటర్ ఈ కేసును గుర్తించింది. మిగతా రెండు కేసుల్లో ఒకటి గుజరాత్ లోనే నమోదు కాగా, మరొకటి ఒడిశాలో బయటపడింది. 

ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా కేసుల్లో పెరుగుదల ఏమీ లేదని, అయితే, కొత్త వేరియంట్లపై నిఘా ఉంచాలని నిర్దేశించారు. కాగా, పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తం అయింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు చేసింది. 

కొవిడ్ ఇంకా పూర్తిగా అంతరించిపోలేదని, అధికారులు నిశితంగా పరిశీలిస్తుండాలని పేర్కొంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మనదేశంలో భయపడాల్సిన అవసరంలేదని తెలిపింది. కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది. 

అంతేకాదు, దేశంలో కరోనా పరిస్థితులపై ప్రతివారం సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ కు రీ ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ వేరియంట్ కు ఇంక్యుబేషన్ వ్యవధి కూడా చాలా తక్కువ అని తెలిపింది. ఏవైనా శాంపిల్స్ పాజిటివ్ వస్తే వాటికి తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని రాష్ట్రాలకు సూచించింది. 

అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ దేశాల్లోనూ బీఎఫ్-7 కేసులు ఉన్నట్టు వివరించింది. ఇకపై విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఎయిర్ పోర్టుల్లో నేటి నుంచే శాంపిల్స్ సేకరణ అమలవుతుందని పేర్కొంది.

More Telugu News