AS Ramakrishna: విజయవాడ కార్యక్రమంలో రోజా స్వయంగా డ్యాన్స్ చేయడంలో అర్థముందా?: మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ

Ex MLC Ramakrishna comments on Roja
షార్ట్స్‌లో చూడండి
అధికారంలోకి వస్తే భూమిపై స్వర్గాన్ని సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇసుక, మట్టి కొరత లేకుండా చేస్తానని చెప్పిన జగన్... ప్రశ్నించిన వారిని మట్టిలో కలిపేస్తున్నారని అన్నారు. 

జగన్ పుట్టినరోజు వేడుకలకు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పుట్టినరోజు వేడుకలకు సాంస్కృతిక, క్రీడాశాఖలు రూ. 2.50 కోట్లు వెచ్చించాయని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి రోజా స్వయంగా డ్యాన్స్ చేయడంలో అర్థమేముందని ప్రశ్నించారు. దివంగత ఎన్టీఆర్ పుట్టినరోజున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తారని... జగన్ పుట్టినరోజు నేపథ్యంలో జేఎన్టీయూ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో బలవంతంగా రక్తదానం చేయించారని విమర్శించారు. 

ఈ మూడున్నరేళ్లుగా రాష్ట్రంలోని ఏ ఒక్కరూ సంతోషంగా లేరని రామకృష్ణ అన్నారు. నమ్మిన ప్రజలను జగన్ నట్టేట ముంచారని దుయ్యబట్టారు. ఉద్యోగులకు సకాలంలో డీఏలు ఇస్తానన్నాడు, రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానన్నాడు, డ్వాక్రా స్థితిగతులు మెరుగుపరుస్తానన్నాడు, అమరావతిని బ్రహ్మాండంగా అబ్బురపరచేలా రాజధానిని నిర్మిస్తానని చెప్పి అన్ని రకాలుగా మోసం చేశారని విమర్శించారు. చెప్పిన మాటలన్నీ మోసకారి మాటలు అని తేలిపోయాయని చెప్పారు. అసెంబ్లీలో టీడీపీతోపాటు మేం కూడా అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నామని తీర్మానం చేసి ఇప్పుడు మూడు రాజధానుల ముచ్చట పెట్టారని మండిపడ్డారు. 

2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేశారని అన్నారు. రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని జగన్ పుట్టినరోజు సంబరాలు? అని ప్రశ్నించారు. పోలీసులను ఉపయోగించి కేసులు పెడుతున్నారని... అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అశోక్ బాబులాంటివారిని అరెస్టు చేసి ఏం సాధించారని అడిగారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిధులను జగన్ పుట్టినరోజుకు వాడకుండా ఉండాలని కోరుతున్నానని చెప్పారు.
Go Back to Shorts
AS Ramakrishna
Telugudesam
Roja
Jagan
ysrcp

More Telugu News