USA: అమెరికా అండర్-19 క్రికెట్ జట్టులో ఐదుగురు తెలుగు అమ్మాయిలే

  • వచ్చే నెల దక్షిణాఫ్రికాలో జరగనున్న అండర్-19 వరల్డ్ కప్
  • టోర్నీలో పాల్గొననున్న 16 దేశాలు
  • అమెరికా జట్టు కెప్టెన్ గా గీతికా కొడాలి
5 Telugu girls in USA under19 cricket team

అమెరికా క్రికెట్లో తెలుగమ్మాయిలు సత్తా చాటుతున్నారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో అండర్-19 టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ క్రమంలో 15 మందితో కూడిన అండర్-19 జట్టును అమెరికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టులో తెలుగు మూలాలున్న అమ్మాయిలు ఏకంగా ఐదుగురు ఉండటం గమనార్హం. అంతేకాదు కెప్టెన్ గా కూడా తెలుగు అమ్మాయే ఎంపికయింది. గీతికా కొడాలి అనే అమ్మాయి జట్టుకు నాయకత్వం వహించనుంది. 

ఇక జట్టుకు ఎంపికైన ఇతర అమ్మాయిల్లో లాస్య ముళ్లపూడి, భూమిక భద్రిరాజు, కస్తూరి వేదాంతం, సాయి తన్మయి ఇయ్యుని ఉన్నారు. అమెరికా మహిళా క్రికెట్లో తెలుగు అమ్మాయిలు సత్తా చాటడంపై హర్షం వ్యక్తమవుతోంది. 

2023 జనవరి 14 నుంచి 29 వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుంది. వాస్తవానికి 2021లోనే ఈ టోర్నీ జరగాల్సి ఉన్నా... కరోనా కారణంగా ఆలస్యమయింది. ఈ టోర్నీలో మొత్తం 16 దేశాలు ఆడుతున్నాయి. టీమిండియా టీమ్ కు షఫాలీ వర్మ కెప్టెన్ గా వ్యవహరించనుంది. టీమిండియా మహిళా క్రికెట్ జట్టులో షఫాలీ ఉన్నప్పటికీ... ఆమెకు 19 ఏళ్లు నిండకపోవడంతో అండర్-19 జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కింది.

More Telugu News