Bengaluru: తిండిపెట్టేందుకు డబ్బులేదని రెండేళ్ల కూతురును చంపేసిన టెక్కీ!

  • బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణం
  • గొంతు పిసికి చంపేసి చెరువులో పడేసిన వైనం
  • ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించిన టెక్కీ
  • అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కర్ణాటక పోలీసులు
Bengaluru Techie Kills 2 Year Old Daughter As He Didnot Have Money To Feed Her

ఉద్యోగం పోయి బిజినెస్ లో నష్టం రావడంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన కూతురును చంపేసుకున్నాడు. రెండేళ్ల వయసున్న కూతురుకు తిండి పెట్టేందుకు డబ్బులేదని ఈ దారుణానికి తెగబడ్డాడు. ఆపై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. బెంగళూరులో జరిగిన ఈ దారుణం వివరాలు..

గుజరాత్ కు చెందిన రాహుల్ పర్మార్ భార్యా పిల్లలతో బెంగళూరులో సెటిల్ అయ్యాడు. ఆరు నెలల క్రితం రాహుల్ చేస్తున్న సాఫ్ట్ వేర్ కొలువు పోయింది. ఇటు బిట్ కాయిన్ బిజినెస్ లోనూ నష్టమొచ్చింది. దీంతో అప్పులపాలైన రాహుల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. మూడు రోజుల క్రితం కూతురుతో కలిసి బయటకు వెళ్లిన రాహుల్.. తిరిగి రాలేదని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గాలింపు మొదలుపెట్టిన పోలీసులకు సిటీ శివార్లలోని ఓ చెరువు దగ్గర రాహుల్ కారు కనిపించింది. ఆ చెరువులో రాహుల్ కూతురు మృతదేహం బయటపడింది.

విచారణలో రాహుల్ తన కూతురును చంపేసినట్లు తేలింది. డబ్బులేకపోవడంతో కూతురుకు తిండిపెట్టలేనని భావించి హత్యకు పాల్పడినట్లు రాహుల్ చెప్పినట్లు పోలీసులు వివరించారు. తనూ ఆత్మహత్యకు ప్రయత్నించినా విఫలమైనట్లు తెలిపాడు. వారం క్రితం తన ఇంట్లో నగలు పోయాయని రాహుల్ ఫిర్యాదు చేయగా.. విచారణలో అది తప్పుడు కంప్లైంట్ అని తేలినట్లు పోలీసులు చెప్పారు. దీంతో రాహుల్ ను స్టేషన్ కు రావాలని సూచించామన్నారు.

ఇంట్లోని నగలు తనే కాజేసి, చోరీ కేసు పెట్టిన విషయం పోలీసులు గుర్తించడం, స్టేషన్ కు రావాలని పిలవడంతో రాహుల్ ఆందోళనకు గురయ్యాడు. పోలీసులు తనపై చర్యలు తీసుకుంటారనే భయంతోనే ఈ దారుణానికి తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

More Telugu News