Chandrababu: ఎవడ్రా రాయలసీమ ద్రోహి...?: కర్నూలులో చంద్రబాబు ఉగ్రరూపం

Chandrababu fires on CM Jagan in Kurnool
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటన కొనసాగుతోంది. కర్నూలు టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చంద్రబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 

రాయలసీమకు ఎవరేం చేశారో చర్చించడానికి తాను సిద్ధమని అన్నారు. ఎవడ్రా రాయలసీమ ద్రోహి... పనికిమాలిన దద్దమ్మల్లారా! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనే రాయలసీమ ద్రోహి అని పేర్కొన్నారు. రాయలసీమను దోచుకునే శక్తి వైసీపీకి ఉందని, రాయలసీమను సస్యశ్యామలం చేసే శక్తి టీడీపీకే ఉందని చంద్రబాబు వివరించారు. రాయలసీమను తాము రతనాల సీమ చేస్తే, జగన్ రెడ్డి రాయలసీమకు ద్రోహం తలపెడుతున్నాడని చంద్రబాబు విమర్శించారు. 

జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. "విశాఖ వెళ్లి ఉత్తరాంధ్ర వాళ్లను రెచ్చగొడతావు, రాయలసీమ వచ్చి ఇక్కడి వాళ్లను రెచ్చగొడతావు. మతాలకు, కులాలకు చిచ్చుపెట్టి చలికాచుకునే నువ్వు రాజకీయం చేస్తావా? ఇదేం పులివెందుల అనుకుంటున్నావా... తరిమి తరిమి కొట్టిస్తా. వైసీపీ గూండాలు ఒకటే గుర్తుపెట్టుకోండి... బట్టలిప్పి కొట్టిస్తా. మర్యాదకు మర్యాద... దెబ్బకు దెబ్బ. ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలైనా ఇస్తా. 23 బాంబులకే భయపడలేదు. నాపైనే దాడి చేయాలనుకుంటున్నారు... మా కార్యకర్తలకు నేను కనుసైగ చేస్తే మీరు చిత్తు చిత్తు అవుతారు" అంటూ హెచ్చరించారు. 

"పోలీసులు ఎవరికి కాపలా కాస్తున్నారు... ఎందుకయ్యా ఎస్పీ ఇక్కడ? ఎస్పీ ఏంచేస్తున్నారు ఇక్కడ? కబ్జాదారులకు కాపలా కాస్తారా, రౌడీలకు అండగా ఉంటారా? నీకు ఐపీఎస్ ఇచ్చిందే దండగ! తమ్ముళ్లూ... నన్ను రెచ్చగొడుతున్నాడు... నన్ను రెచ్చగొట్టినవాడి పతనం ఖాయం! నేను ఎవరికీ భయపడను... ఒక్క ప్రజలకు తప్ప. నేను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాని" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
Kurnool
TDP
YSRCP

More Telugu News