Elon Musk: ట్విట్టర్‌లో తీసివేతలు షురూ.. భారత్‌లో 180 మంది ఇంటికి!

  • ట్విట్టర్‌‌ను టేకోవర్ చేస్తూనే ఉన్నతాధికారులను తొలగించిన మస్క్
  • ప్రపంచవ్యాప్తంగా 7500 మంది ఉద్యోగులు
  • ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించాలని నిర్ణయం
  • ఇప్పటికే ఈ-మెయిల్స్ అందుకుంటున్న ఉద్యోగులు
Twitter India Removes 180 Employees

ఎలాన్ మస్క్ అనుకున్నంత పనీ చేశారు. ట్విట్టర్‌ను టేకోవర్ చేస్తూనే ఉన్నతాధికారులపై వేటేసిన మస్క్.. సంస్థలోని ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదిస్తున్నారు. ఉద్యోగుల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని నిర్ణయించుకున్న మస్క్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఉన్నపళంగా ఇంటికి పంపించేస్తున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

ఈ క్రమంలో దేశంలో పనిచేస్తున్న 230 మంది ఉద్యోగుల్లో 180 మందికి ఉద్వాసన పలికినట్టు సమాచారం. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఇంజినీరింగ్, సేల్స్ అండ్  మార్కెటింగ్, కమ్యూనికేషన్, పాలసీ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. ఇలా తొలగించిన వారికి పరిహారం ఇస్తారా? లేదా? అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇక, ట్విట్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,500 మంది పనిచేస్తుండగా 50 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్ ఇండియాలో ఉద్యోగుల తీసివేతలు మొదలైనట్టు ఓ ఉద్యోగి తెలిపాడు. తన సహచరుల్లో కొందరికి ఇప్పటికే ఈ-మెయిల్స్ రూపంలో తీసివేతలకు సంబంధించిన సమాచారం అందిందని పేర్కొన్నాడు. అయితే, ఇండియాలో తీసివేతలపై ట్విట్టర్ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారమూ లేదు.

ఉద్యోగులకు గురువారం ఓ సందేశం పంపుతూ.. ఉద్యోగులతోపాటు ట్విట్టర్ సిస్టమ్స్, కస్టమర్ డేటా భద్రత దృష్ట్యా అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నామని, ఒకవేళ మీరు ఆఫీసులో ఉన్నా, ఆఫీసుకు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్నా దయచేసి ఇంటికి వెళ్లిపోవాలని సూచించింది. అది చూసిన ఉద్యోగులు మరింత ఆందోళనకు గురయ్యారు.

More Telugu News