ట్విట్టర్ లో సగం మంది ఉద్యోగులపై వేలాడుతున్న కత్తి... వర్క్ ఫ్రం హోంకూ చెల్లుచీటీ దిశగా మస్క్
- ఇప్పటికే సీఈఓ పరాగ్ సహా పలువురు కీలక ఉద్యోగులకు మస్క్ ఉద్వాసన
- ట్విట్టర్ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే దిశగా మస్క్ చర్యలు
- 3,700 మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లుగా వార్తలు
- కొన్ని మినహాయింపులను వదిలేసి వర్క్ ఫ్రం హోంకు గుడ్ బై చెప్పనున్న ట్విట్టర్
ట్విట్టర్ నిర్వహణ ఖర్చును తగ్గించుకునే దిశగానే ఎలాన్ మస్క్ ఉద్యోగుల కోతపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపుగా 3,700 మంది ఉద్యోగులను ఇంటికి పంపే దిశగా మస్క్ ఆలోచన చేస్తున్నారట. ఈ విషయంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులకు ఎంతమేర పరిహారం ఇవ్వాలనే దానిపైనే మస్క్ తర్జనభర్జన పడుతున్నట్లుగా సమాచారం.
ఇక కరోనా నేపథ్యంలో అమలులోకి వచ్చిన వర్క్ ఫ్రం హోమ్ కు ట్విట్టర్ లో పూర్తిగా చెల్లు చీటి ఇవ్వాలన్న దిశగానూ మస్క్ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఒకేసారి భారీ నిర్ణయం తీసుకోకుండా.. కొన్ని మినహాయింపులను పక్కనపెట్టి మిగిలిన వారందరూ ఆఫీసుకు వచ్చి పనిచేయాలని మస్క్ నుంచి త్వరలోనే ఆదేశాలు వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం. ఇటు సగం మంది ఉధ్యోగుల తొలగింపు, మరోపై వర్క్ ఫ్రం హోంలకు ఉద్వాసన వార్తలతో ట్విట్టర్ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో వున్నారు.