విశాఖను దోపిడీ రాజధానిగా మార్చేస్తున్నారు: అచ్చెన్నాయుడు
- ఉత్తరాంధ్ర మంత్రులు దోచుకుంటున్నారన్న అచ్చెన్న
- వాళ్ల దోపిడీకి అడ్డుపడుతున్నామని తమపై ఆరోపణలని విమర్శ
- విజయవాడలో జరిగిన నాగుల చవితి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ ను తీసుకొచ్చారని ముఖ్యమంత్రి జగన్ పై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నేతల స్వార్ధం కోసమే ప్రాంతీయ చిచ్చు పెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ అంటే జే గ్యాంగ్ అడ్డా కాదని స్పష్టం చేశారు. రుషికొండను కొల్లగొట్టి కట్టుకునే ప్యాలెస్ తో ఏం సాధిస్తారంటూ నిలదీశారు. తన బండారం బయటపడుతుందనే భయంతోనే శుక్రవారం టీడీపీ నాయకులను అడ్డుకున్నారని ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ శాఖలు అన్నింట్లోనూ సాక్షి సిబ్బందిని పెట్టి వారిపై సజ్జల పర్యవేక్షణ చేస్తున్నారని, సాక్షి పాలేగాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.