T20 World Cup: పాక్ కు సెకండ్ షాక్.. సింగిల్ రన్ తో గెలిచిన జింబాబ్వే

  • టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే
  • నిర్ణీత 20 ఓవర్లలో 130 పరుగులు చేసిన చిన్న జట్టు
  • 131 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన పాక్
  • 129 పరుగులు మాత్రమే చేసిన వైనం
  • చివరి బంతికి రనౌట్ అయిన పాక్ బౌలర్ అఫ్రీది
  • భారత్ తో మ్యాచ్ మాదిరే జింబాబ్వేతోనూ చివరి బంతికి ఓడిన పాక్
Zimbabwe beats pakistan by 1 run in t20 world cup

టీ20 వరల్డ్ కప్ లో వరుస సంచనాలు చోటుచేసుకుంటున్నాయి. ఏమాత్రం గెలుపు అంచనాలు లేని కొత్త జట్లు కూడా ఈ మెగా టోర్నీలో బలమైన జట్లను మట్టి కరిపిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే వెస్టిండీస్ సిరీస్ నుంచి అవుట్ కాగా... అదే ప్రమాదం మరికొన్ని కీలక జట్లకు పొంచే ఉంది. గురువారం రాత్రి ముగిసిన లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. అంతగా పటిష్ట లైనప్ లేని జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. అది కూడా ఒకే ఒక్క పరుగు తేడాతో పాక్ ఓడిపోవడం గమనార్హం. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన జింబాబ్వే జట్టు మరో సంచలనాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. పదునైన బంతులను సంధించిన పాక్ బౌలర్లు జింబాబ్వేను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగారు. పాక్ బౌలర్ల ధాటికి పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డ జింబాబ్వే బ్యాటర్లు... 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 130 పరుగులు మాత్రమే చేయగలిగారు. జింబాబ్వే బ్యాటర్లలో టాప్ స్కోరర్ గా నిలిచిన సియాన్ విలియమ్స్ 31 పరుగులు మాత్రమే చేశాడు. క్రమంగా వికెట్లు పడుతున్న నేపథ్యంలో జింబాబ్వే బ్యాటర్లు వికెట్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించింది.

ఇక 131 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన పాక్ ను కెప్టెన్ బాబర్ అజామ్ (4) మరోమారు నిరాశ పరిచాడు. నాలుగో ఓవర్ లోనే బాబర్ వికెట్ ను చేజార్చుకున్న పాక్ కు... ఐదో ఓవర్ లో మరో ఓపెనర్ మొహ్మద్ రిజ్వాన్ (14) అవుట్ రూపంలో మరో షాక్ తగిలింది. అయితే ఫస్ట్ డౌన్ లో వచ్చిన షాన్ మసూద్ (44) జట్టును ఆదుకునే యత్నం చేశాడు. అయితే భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డ మసూద్ 38 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేయగలిగాడు. అతడికి మిగిలిన బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లభించలేదు. 

ఇక చివరి దాకా పోరాటం చేసిన పాక్...తన ఇన్నింగ్స్ లో చివరి బంతికి ఒక్క పరుగు చేయలేక ఓడిపోయింది. 20వ ఓవర్ చివరి బంతికి 3 పరుగులు తీస్తే పాక్ గెలుస్తుంది. అలా కాకుండా 2 పరుగులు తీసినా... మ్యాచ్ సూపర్ ఓవర్ దిశగా సాగుతుంది. అయితే పాక్ బౌలర్ షహీద్ అఫ్రీది బంతిని కొట్టి ఓ పరుగు తీశాడు. రెండో పరుగు తీయలేక రనౌట్ అయ్యాడు. ఫలితంగా 20 ఓవర్లలో పాక్ 8 వికెట్ల నష్టానికి కేవలం 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంటే... సింగిల్ పరుగుతో జింబాబ్వే చేతిలో పాకిస్థాన్  మట్టి కరిచిందన్న మాట. ఆదివారం భారత్ తో జరిగిన మ్యాచ్ లోనూ పాక్ చివరి బంతికి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News