YSRCP: టీడీపీ దుశ్శాస‌నుల పార్టీగా మారింది: ఏపీ మంత్రి రోజా

  • ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌పై స్పందించిన రోజా
  • టీడీపీ నేత‌లే మ‌హిళ‌ల‌పై అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోప‌ణ‌
  • ఐ టీడీపీ అంటే ఇడియ‌ట్స్ టీడీపీ అని కామెంట్‌
  • టీడీపీ నేత‌ల‌ను రాష్ట్రం నుంచి త‌రిమికొట్టాల‌ని మ‌హిళ‌ల‌కు రోజా పిలుపు
ap minister rk roja fires on tdp

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీపై రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఆమె.. టీడీపీని దుశ్శాస‌నుల పార్టీగా అభివర్ణించారు. టీడీపీ దుశ్శాస‌నుల పార్టీగా మారిపోయింద‌ని ఆమె అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేత‌లే అత్యాచారాల‌కు, అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆమె ఆరోపించారు. యువ‌తులు, మ‌హిళ‌ల‌పై టీడీపీ నేత‌లు పాల్ప‌డుతున్న అరాచ‌కాల‌పై ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు, లోకేశ్ ఎందుకు స్పందించ‌డం లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు. టీడీపీ నేత వేధింపుల వ‌ల్లే ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని ఆమె తెలిపారు. ఆడ‌వాళ్ల‌ను వేధించిన వారికే టీడీపీలో ప‌ద‌వులు ఇస్తున్నార‌ని కూడా రోజా ఆరోపించారు. ఇదే మాట‌ను దివ్య‌వాణి కూడా చెప్పిన‌ట్లు రోజా గుర్తు చేశారు. 

టీడీపీ హ‌యాంలోనే రిషితేశ్వ‌రిపై ఘోరం జ‌రిగింద‌ని, వ‌న‌జాక్షి లాంటి మ‌హిళా అధికారిని ఇసుక‌లో వేసి కొట్ట‌డం జ‌రిగింద‌ని రోజా అన్నారు. ఇప్పుడు కూడా టీడీపీ నేత‌ల వ‌ల్లే మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రుగుతున్నాయ‌ని ఆమె ఆరోపించారు. ప్ర‌తి చిన్న విష‌యానికి ట్వీట్లు చేసే లోకేశ్... ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌పై ఎందుకు స్పందించ‌లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఐ టీడీపీ అంటే ఇడియ‌ట్స్ పార్టీ అంటూ ఆమె మరింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ నేత‌లను రాష్ట్రంలోని మ‌హిళ‌లంతా త‌రిమికొట్టాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

More Telugu News