Devaragattu: దేవరగట్టులో వైభవంగా బన్నీ ఉత్సవం.. కర్రల సమరంలో 50 మందికి గాయాలు

  • కర్నూలు జిల్లాలో దేవరగట్టులో కొలువైన శ్రీ మాళ మల్లేశ్వర స్వామి
  • దసరా రోజున వైభవంగా బన్నీ ఉత్సవం
  • స్వామి వారి విగ్రహాలను దక్కించుకునేందుకు గ్రామస్థుల కర్రల పోరు
  • కర్రల సమరానికి వస్తూ కర్ణాటకకు చెందిన బాలుడి మృతి
50 injured in devaragattu karrala samaram

కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా ఉత్సవాల సందర్భంగా జరిగిన కర్రల సమరంలో 50 మంది గాయపడ్డారు. కర్రల సమరానికి వెళ్తుండగా ఓ బాలుడు మృతి చెందాడు. అతడిని కర్ణాటకలోని శిరుగుప్పకు చెందిన రవీంద్రనాథ్‌రెడ్డిగా గుర్తించారు. గుండెపోటుతోనే అతడు మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, దేవరగట్టులోని శ్రీమాళ మల్లేశ్వర స్వామికి ప్రతి ఏటా దసరా రోజున బన్నీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జరిగే కర్రల సమరంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒకవైపు.. అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భక్తులు ఇంకోవైపు ఉండి కర్రలతో  తలపడతారు. 

స్వామి వారి మూర్తులను చేజిక్కించుకునేందుకు ఇరు వర్గాలు కర్రలతో హోరాహోరీగా తలపడతాయి. ఏళ్లుగా వస్తున్న ఆచారమిది. వర్షం కారణంగా ఈసారి కర్రల సమరం కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. అనంతరం జరిగిన సమరంలో 50 మంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు. కాగా, కర్రల సమరాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాదు, రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తారు. ఈ కర్రల సమరంలో గతంలో తలలు పగిలి మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి.

More Telugu News