Adipurush: ‘ఆదిపురుష్’పై ట్రోలింగ్స్‌కు ఎండ్‌కార్డ్ వేయాలని నిర్ణయం.. నేడు త్రీడీలో విడుదల కానున్న టీజర్

  • ప్రభాస్ కథానాయకుడిగా మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’
  • వచ్చే ఏడాది జనవరి 12న  ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • నేడు హైదరాబాద్ వేదికగా 3డీలో టీజర్
  • హాజరు కానున్న ప్రభాస్, దర్శకుడు ఓంరౌత్
Adipurush Movie unit ready to launch teaser in 3d format

ప్రముఖ కథానాయకుడు ప్రభాస్ ముఖ్యపాత్రలో నటిస్తున్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’ టీజర్‌పై వెల్లువెత్తుతున్న ట్రోల్స్‌పై చిత్ర బృందం స్పందించింది. వాటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించాడు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అయోధ్యలో టీజర్‌ను విడుదల చేశారు. అప్పటి నుంచి ట్రోల్స్ మొదలయ్యాయి. ఇందులోని విజువల్ ఎఫెక్ట్స్ కార్టూన్స్‌లా ఉన్నాయంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అంతేకాదు, అందులోని విజువల్ ఎఫెక్ట్స్ రామాయణంలోని పాత్రలను అపహాస్యం చేసేలా ఉన్నాయంటూ హిందూత్వ వాదులు, పలువురు రాజకీయ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో చిత్రబృందం నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. నేడు హైదరాబాద్ వేదికగా 3డీలోనూ ‘ఆదిపురుష్’ టీజర్‌ను విడుదల చేయబోతోంది. ఈ వేడుకకు దర్శకుడు ఓంరౌత్, నటుడు ప్రభాస్ హాజరవుతారు. ఈ వేడుకలో చిత్రంపై వస్తున్న విమర్శలపై వివరణ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కాగా, రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు.

More Telugu News