Team India: ఇండోర్ లో టీమిండియా ఓటమి... చివరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టుకు ఊరట

  • భారీ లక్ష్యఛేదనలో భారత్ విఫలం
  • 49 పరుగుల తేడాతో ఓటమి
  • నిరాశపర్చిన రోహిత్ శర్మ, సూర్యకుమార్
  • 46 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్
  • ఇప్పటికే సిరీస్ ను గెలిచిన రోహిత్ సేన
Team India lost third T20 match by 49 runs

వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి సిరీస్ ను టీమిండియాకు అప్పగించిన దక్షిణాఫ్రికా చివరి టీ20లో ఊరట పొందింది. ఇండోర్ లో జరిగిన మ్యాచ్ లో సఫారీలు భారత్ పై 49 పరుగుల తేడాతో విజయం సాధించారు.

228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 18.3 ఓవర్లలో 178 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. టీమిండియా ఇన్నింగ్స్ లో దినేశ్ కార్తీక్ టాప్ స్కోరర్. దినేశ్ కార్తీక్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 46 పరుగులు చేశాడు. 

అంతకుముందు రిషబ్ పంత్ 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 27 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా, శ్రేయాస్ అయ్యర్ ఒక పరుగు చేసి నిష్క్రమించాడు. సూర్యకుమార్ యాదవ్ (8) నిరాశపరిచాడు. ట్రిస్టాన్ స్టబ్స్ పట్టిన అద్భుత క్యాచ్ కు వెనుదిరిగాడు. 

హర్షల్ పటేల్ 17 పరుగులు చేయగా, ఆఖర్లో దీపక్ చహర్, ఉమేశ్ యాదవ్ బ్యాట్లు ఝుళిపించడంతో టీమిండియా 150 పరుగుల మార్కు దాటింది. చహర్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 31 పరుగులు చేశాడు. ఉమేశ్ యాదవ్ 20 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వేన్ పార్నెల్ 2, లుంగీ ఎంగిడి 2, కేశవ్ మహరాజ్ 2, రబాడా 1, ప్రిటోరియస్ 1 వికెట్ తీశారు. 

కాగా, ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లక్నోలో జరగనుంది. రెండో వన్డే ఈ నెల 9న రాంచీలో, మూడో వన్డే ఈ నెల 11న ఢిల్లీలో జరగనున్నాయి.

More Telugu News