Telangana: టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

  • 2019లో జ‌హీరాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన పాటిల్‌
  • పాటిల్ త‌ప్పుడు అఫిడ‌విట్ దాఖ‌లు చేశార‌న్న ఆయ‌న ప్ర‌త్య‌ర్థి మ‌ద‌న్ మోహ‌న్ రావు
  • పాటిల్ ఎన్నిక‌ను ర‌ద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్‌
  • తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో స‌వాల్ చేసిన మ‌ద‌న్ మోహ‌న్ రావు
  • అక్టోబ‌ర్ 10న హైకోర్టుకు హాజ‌రు కావాల‌ని పాటిల్‌కు సుప్రీం ఆదేశం
supreme court directs ts high court re verity the petition over trs mp bb patil affidavit

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన జ‌హీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు బుధ‌వారం స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బీబీ పాటిల్ ఎన్నిక చెల్ల‌దంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై పునఃప‌రిశీల‌న జ‌ర‌పాల‌ని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ పిటిష‌న్‌పై పునఃప‌రిశీల‌న పూర్తయ్యే దాకా అన్ని అంశాలు ఓపెన్‌గానే ఉంటాయ‌ని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది.

2019 ఎన్నిక‌ల్లో జ‌హీరాబాద్ స్థానం నుంచి బీబీ పాటిల్ ఎంపీగా గెలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే, బీబీ పాటిల్ త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో త‌ప్పుడు స‌మాచారం పొందుప‌ర‌చార‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థి మ‌ద‌న్ మోహ‌న్ రావు ఆరోపిస్తూ, పాటిల్ ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌ని తెలంగాణ హైకోర్టును కోరారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అభిషేక్ రెడ్డి... మ‌ద‌న్ మోహ‌న్ రావు పిటిష‌న్‌ను కొట్టివేశారు.

హైకోర్టు సింగిల్ జ‌డ్జి ఇచ్చిన తీర్పును మ‌ద‌న్ మోహ‌న్ రావు సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. ఈ పిటిష‌న్‌పై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు... ఈ వ్య‌వ‌హారంపై దాఖ‌లైన పిటిష‌న్‌ను పునఃప‌రిశీలించాల‌ని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అక్టోబ‌ర్ 10న హైకోర్టుకు హాజ‌రు కావాల‌ని బీబీ పాటిల్‌ను ఆదేశించింది.

More Telugu News