AP High Court: ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో కేసులో త‌దుప‌రి చ‌ర్య‌ల నిలిపివేత‌

  • గోరంట్ల‌ మాధ‌వ్ ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు న‌మోదు
  • ఈ కేసులో నిందితులుగా ప‌లువురు టీడీపీ నేత‌ల పేర్లు
  • త‌న పేరును చేర్చ‌డాన్ని స‌వాల్ చేసిన చింత‌కాయ‌ల విజ‌య్‌
  • విజ‌య్ క్వాష్ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు
  • త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను నిలిపివేస్తూ స్టే ఆర్డర్ జారీ  
ap high court issues stay order on gorantla madhav video case

ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్టుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు చెందిన‌దిగా చెబుతున్న వీడియో వ్య‌వ‌హారంపై త‌దుప‌రి చ‌ర్య‌లను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఇక‌పై త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఆర్డ‌ర్ జారీ చేసింది. త‌న‌దిగా చెబుతూ ఓ మార్ఫింగ్ వీడియోతో త‌న ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగిస్తున్నారంటూ గోరంట్ల మాధ‌వ్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఏపీ సీఐడీ అధికారులు ఓ కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ప‌లువురు టీడీపీ నేత‌ల పేర్ల‌ను సీఐడీ అధికారులు చేర్చారు.

ఈ కేసును కొట్టివేయాలంటూ టీడీపీ యువ నేత‌, పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కాయ‌ల విజ‌య్ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై హైకోర్టులో గురువారం విచార‌ణ జ‌రిగింది. ఈ కేసులో త‌న‌ను నిందితుడిగా చేర్చిన వైనాన్ని విజ‌య్ హైకోర్టులో స‌వాల్ చేశారు. విజ‌య్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు విన్న హైకోర్టు ఈ కేసులో త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను నిలిపివేయాలంటూ సీఐడీ అధికారుల‌ను ఆదేశిస్తూ స్టే ఆర్డ‌ర్‌ను జారీ చేసింది.

More Telugu News