Telangana: స‌క‌ల జ‌నుల స‌మ్మెకు 11 ఏళ్లు పూర్తి... నాటి ఉద్య‌మాన్ని గుర్తు చేసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌

  • 2011 సెప్టెంబ‌ర్ 13న ప్రారంభ‌మైన స‌క‌ల జ‌నుల స‌మ్మె
  • ఏక‌బిగిన 42 రోజుల పాటు సాగిన స‌మ్మె
  • నాడు గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడిగా ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌
11 years for sakala janula samme

తెలంగాణ ఉద్య‌మంలో స‌క‌ల జ‌నుల స‌మ్మెకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు చెందిన సేవ‌లు నిలిచిపోయాయి. ఉద్యోగులంతా రోడ్డెక్కారు. ఏకబిగిన 42 రోజుల పాటు జ‌రిగిన ఈ స‌మ్మె తెలంగాణ ప్ర‌జ‌ల్లో నాటుకుని ఉన్న‌ ప్ర‌త్యేక రాష్ట్ర కాంక్ష‌ను బ‌లంగా చాటింది. 

ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌తో పాటుగా ప్ర‌భుత్వ ర‌వాణా సేవ‌లు కూడా నిలిచిపోయాయి. ప్రైవేట్ ర‌వాణా కూడా ఎక్క‌డిక‌క్కడ నిలిచిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. ఈ స‌మ్మె జ‌రిగి మంగ‌ళ‌వారం నాటికి స‌రిగ్గా 11 ఏళ్లు నిండాయి. 

2011 సెప్టెంబ‌ర్ 13న ప్రారంభ‌మైన ఈ స‌మ్మెలో ఉద్యోగ సంఘాల నేత‌లే కీల‌క భూమిక పోషించారు. నాడు తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడిగా ఉన్న ప్ర‌స్తుత ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌... ఉద్య‌మంలో ముందుండి పోరాడారు. సక‌ల జ‌నుల స‌మ్మెకు 11 ఏళ్లు పూర్తి అయిన నేప‌థ్యంలో నాటి ఉద్య‌మానికి సంబంధించిన చిత్రాల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న మిత్రులు, ఉద్యమకారులకు ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ ఉద్యమ అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరులైన వీరులకు జోహార్లు తెలిపారు.

More Telugu News