కాంగ్రెస్ పనైపోయింది: గుజరాత్ లో కేజ్రీవాల్

Kejriwal hits out Congress allegations
  • గుజరాత్ లో కేజ్రీవాల్ పర్యటన
  • అహ్మదాబాద్ లో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం
  • పంజాబ్ ప్రభుత్వం గుజరాత్ లో ప్రకటనల కోసం ఖర్చుచేస్తోందన్న విలేకరి
  • ఎవరా మాట అన్నది? అంటూ కేజ్రీవాల్ తీవ్ర స్పందన
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో ఓ సభ నుంచి బదులిచ్చారు. కాంగ్రెస్ పనైపోయిందని ఒక్క ముక్కలో తేల్చేశారు. వచ్చే ఏడాది ఆరంభంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, అహ్మదాబాద్ లో పారిశుద్ధ్య కార్మికులతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియా ఆయనను ప్రశ్నించింది. 

పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం దివాలా ముంగిట నిలిచి, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో గుజరాత్ ఎన్నికల కోసం కోట్ల రూపాయలను వాణిజ్య ప్రకటనల రూపంలో ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది... దీనిపై మీరేమంటారు? అని మీడియా ప్రతినిధి కేజ్రీవాల్ ను అడిగారు. 

వెంటనే స్పందించిన కేజ్రీవాల్ "ఎవరా మాట అన్నది?" అంటూ తిరిగి ప్రశ్నించారు. "ఓ కాంగ్రెస్ నేత ఆరోపిస్తున్నాడు కదా?" అని ఆ రిపోర్టర్ బదులిచ్చాడు. దాంతో, కేజ్రీవాల్ స్పందిస్తూ... "కాంగ్రెస్ కథ ముగిసింది... వాళ్లు అడిగే ప్రశ్నల గురించి మాట్లాడకండి. ప్రజలకు దీనిపై చాలా స్పష్టత ఉంది. కాంగ్రెస్ లేవనెత్తే అంశాల గురించి పట్టించుకోవడం అనవసరం" అని వ్యాఖ్యానించారు. 

అంతేకాదు, కాంగ్రెస్ కు ఓటు వేసి తమ ఓట్లను వృథా చేసుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. గుజరాత్ లో బీజేపీకి తామే ప్రత్యామ్నాయమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గుజరాత్ లో బీజేపీ ఉండరాదని భావిస్తున్నవారే కాంగ్రెస్ ను కూడా వ్యతిరేకిస్తున్నారని, అలాంటి వారి ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
Go Back to Shorts
Arvind Kejriwal
Congress
Gujarath
AAP

More Telugu News