diabetes: మధుమేహం నియంత్రణలోకి రావడం లేదా..? ప్రపంచ ఆరోగ్య సంస్థ టిప్స్ ఇవే

  • చక్కెర, ఉప్పు పరిమితి మీరొద్దు
  • రోజులో 5 గ్రాముల ఉప్పు తీసుకోవచ్చు
  • పంచదార అయితే 25 గ్రాములకు పరిమితం కావాలి
  • శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ కు దూరంగా ఉండాలి
Cant manage your diabetes Here are 4 health tips suggested by WHO

మధుమేహం.. ఇదొక జీవనశైలి, జీవక్రియలకు సంబంధించిన ఆరోగ్య సమస్య. క్రమబద్ధమైన ఆహారం, జీవనంతో దీన్ని చక్కగా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. కానీ, అలాంటి క్రమశిక్షణ కొద్ది మందికే సాధ్యపడుతుంది. ఎక్కువ మంది మధుమేహం నియంత్రణ కోసం పూర్తిగా ఔషధాలపైనే ఆధారపడుతుంటారు. ఆహారం, జీవనశైలి పరమైన మార్పులతో దీన్ని చక్కగా నియంత్రించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చెబుతోంది. 


మధుమేహం నియంత్రణలో లేకపోతే గుండె, మూత్రపిండాల సమస్యలు పలకరిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్, కేన్సర్ పై పోరాటానికి వీలుగా కొన్ని సూచనలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్వీట్ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. గుండె జబ్బులు, స్ట్రోక్, కేన్సర్, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలు ఇవే ప్రపంచ మరణాల్లో 70 శాతానికి కారణమవుతున్నాయి. ఇలా మరణించే వారిలో 70 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉంటున్నారు. కనుక ఈ సమస్యలను ఎదుర్కొంటున్నవారు ఏం చేయవచ్చో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

చక్కెర, ఉప్పు
ఒకరు ఒక రోజులో ఒక టీస్పూన్ లేదా 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. అది ఏ రూపంలో అయినా సరే రోజు మొత్తానికీ ఇదే పరిమితి వర్తిస్తుంది. ఉప్పు (సోడియం) అంటే కేవలం మనం వంటల్లో వేసుకునేది, విడిగా కలుపుకునేది అనుకునేరు. కూరగాయాల్లోనూ చాలా తక్కువ పరిమాణంలో సోడియం ఉంటుంది. స్నాక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటే మోతాదుకు మించిన సోడియం శరీరంలోకి చేరుతుంది. ఉప్పుకు బదులు తాజాగా ఎండబెట్టిన కరివేపాకు, తాజా దినుసులు వాడుకోవాలి. 

ఒక రోజులో ఒక వ్యక్తి 50 గ్రాములకు మించి చక్కెర తీసుకోకూడదన్నది మరో సూచన. అంటే ఒక రోజులో ఏ రూపంలో అయినా కానీ 12 టీస్పూన్లకు మించి చక్కెర తినకూడదు. ఇది నియంత్రణలో ఉంచుకోలేని వారికి మాత్రమే. అసలు 50 గ్రాములకు బదులు 25 గ్రాములకే పరిమితం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. మరీ ముఖ్యంగా రెండేళ్లలోపు పిల్లలకు ఇచ్చే ఆహారంలో ఉప్పు, పంచదార వేయవద్దు.

శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్
తక్కువ ఫ్యాట్ ఉన్న పాలను వాడుకోవాలి. వైట్ చికెన్, చేపలకు పరిమితం కావాలి. మటన్ కు దూరంగా ఉండాలి. దీనికి అదనంగా నూనెతో బాగా వేయించిన, వేడి చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటివల్ల శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ విడుదల అవుతాయి. ఇవి కొలెస్ట్రాల్ ను పెంచి గుండె జబ్బులకు కారణమవుతాయి. శీతల పానీయాలలో చక్కెరలు చాలా అధికంగా ఉంటాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు. ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. నీరు ఎక్కువగా తాగాలి. 

ఆరోగ్యకరమైన ఆహారం
ముడి ధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పాలిష్డ్, ప్రాసెస్డ్ ధాన్యాలను దూరం పెట్టాలి. బ్రౌన్ రైస్, గోధుమలను రోజువారీ తీసుకోవాలి. ఆకుపచ్చని తాజా కూరగాయలతోపాటు, పండ్లను తీసుకోవాలి. గుడ్లు, చేపలు కూడా తినొచ్చు. కాకపోతే గుడ్డు ఒకటికి మించి తీసుకోకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ తాజా సూచనలకు అదనంగా రోజువారీ వ్యాయామం చేయడం వల్ల కూడా మధుమేహాన్ని చక్కగా నియంత్రించుకోవచ్చు. గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు.

More Telugu News