IT Raids: ఏపీ, తెలంగాణలో వాసవి గ్రూప్ సంస్థలపై ఐటీ దాడులు

  • తెల్లవారుజామున 5 గంటల నుంచే ఐటీ దాడులు
  • తనిఖీలు చేపట్టిన ఆదాయ పన్ను శాఖ అధికారుల బృందం
  • పన్నుల ఎగవేతకు పాల్పడినట్టు అనుమానం
  • ఏకకాలంలో 20 చోట్ల దాడులు
IT Raids on Vasavi Group companies

వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వాసవి గ్రూప్ కార్యాలయాల్లో ఆదాయ పన్ను అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 20 చోట్ల సోదాలు జరిపారు. వాసవి గ్రూప్ చైర్మన్, వాసవి గ్రూప్ డైరెక్టర్ విజయ్, ఆయన తనయుడి ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు జరిపారు. వాసవి రియాలిటీ, వాసవి నిర్మాణ్, వాసవి ఇన్ ఫ్రా, శ్రీముఖ సంస్థల కార్యాలయాల్లో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఐటీ శాఖ దాడులు జరిపింది. ఈ దాడుల్లో 18 మంది సభ్యుల ఆదాయ పన్ను శాఖ బృందం పాల్గొంది. ప్రధానంగా వాసవి గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారిపై ఐటీ శాఖ ఆరా తీసినట్టు తెలుస్తోంది. 

వాసవి గ్రూప్ భారీగా నిర్మాణాలు చేపడుతూ పన్నులు ఎగవేసినట్టు ఐటీ శాఖ అనుమానిస్తోంది. 2020 నుంచి ఈ గ్రూప్ సంస్థల ఐటీ రిటర్న్స్ పట్ల సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ దాడులు నిర్వహించినట్టు సమాచారం. వాసవి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ సోదాల నేపథ్యంలో, రియల్ బూమ్ కు వేదికైన హైదరాబాదులో కలకలం రేగింది.

More Telugu News