VVS Laxman: జింబాబ్వే టూర్ లో టీమిండియా కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్

  • ఈ నెల 18 నుంచి జింబాంబ్వేలో టీమిండియా పర్యటన
  • 3 వన్డేలు ఆడనున్న టీమిండియా
  • ఈ నెల 27 నుంచి ఆసియాకప్
  • టీ20 జట్టుతో పాటే ఉండనున్న ద్రావిడ్
  • వన్డే జట్టుకు కోచ్ గా లక్ష్మణ్
VVS Laxman as Team India coach in Zimbabwe tour

జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ అవతారమెత్తారు. త్వరలో జింబాబ్వేలో పర్యటించే టీమిండియాకు లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనలో టీమిండియా, జింబాబ్వే జట్టుతో 3 వన్డేలు ఆడనుంది. ఆసియా కప్ ఆగస్టు 27న ప్రారంభం కానుండగా, అంతకుముందే జింబాబ్వేలో భారత జట్టు పర్యటన షురూ కానుంది. ఆగస్టు 18, 20, 22 తేదీల్లో జింబాబ్వేతో వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. 

కాగా, రెగ్యులర్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీ20 జట్టుతో కలిసి ఆసియా కప్ కోసం ఈ నెల 23న యూఏఈ చేరుకుంటాడని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. రాహుల్ ద్రావిడ్ కు విరామం ఇచ్చినట్టు కాదని స్పష్టం చేశారు. ఆసియా కప్ లో పాల్గొనే ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, దీపక్ హుడా మాత్రమే జింబాబ్వే టూర్లో పాల్గొంటున్నారని, మిగతా టీ20 జట్టంతా రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఆసియాకప్ కు సన్నద్ధమవుతుందని జై షా వివరించారు. ద్రావిడ్ ప్రధాన జట్టుతో పాటే ఉంటాడని తెలిపారు.

More Telugu News