Munugode: రాహుల్‌గాంధీ వచ్చి ప్రచారం చేసినా.. మునుగోడులో కాంగ్రెస్ మునగడం ఖాయం: ఇంద్రసేనారెడ్డి

  • టీఆర్ఎస్ ముందస్తుకు వెళ్లే చాన్స్ ఉందన్న ఇంద్రసేనారెడ్డి 
  • గతంలో మునుగోడు సెగ్మెంట్‌లో బీజేపీకి 30 వేల ఓట్లు వచ్చాయని వెల్లడి 
  • మునుగోడులో టీఆర్ఎస్ గెలవలేదని స్పష్టీకరణ
TRS Cannot win in munugode says indrasena reddy

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక బదులు టీఆర్ఎస్ ముందస్తుకే వెళ్లే అవకాశం ఉందని బీజేపీ నేత, జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీచేసినప్పుడు మునుగోడు సెగ్మెంట్లో బీజేపీకి 30 వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. 

మునుగోడుపై రాజగోపాల్‌రెడ్డికి మంచి పట్టు ఉందన్న ఇంద్రసేనారెడ్డి.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించినా మునుగోడులో ఓడిపోవడానికి కారణం రాజగోపాల్‌రెడ్డేనని అన్నారు. అప్పుడే ఓడిపోయిన టీఆర్ఎస్ ఇప్పుడెలా గెలుస్తుందన్నారు. మునుగోడులో విజయం మళ్లీ రాజగోపాల్‌రెడ్డిదేనని జోస్యం చెప్పారు. అక్కడ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా మునుగోడులో కాంగ్రెస్‌కు పరాజయం తప్పదని ఇంద్రసేనారెడ్డి తేల్చి చెప్పారు.

More Telugu News