Anand Mahindra: గ్యాడ్జెట్ల యుగంలో ఈ ప్రాచీన యంత్రం ఎంత అద్భుతంగా పనిచేస్తోందో..!: ఆనంద్ మహీంద్రా

  • బియ్యం దంచే చెక్క పరికరాన్ని పరిచయం చేసిన ఆనంద్ మహీంద్రా
  • సమర్థవంతమైనది, ఎప్పటికీ పనిచేసేదంటూ ట్వీట్
  • ఒడిశాలోని గిరిజన రైతుల వినియోగం
Anand Mahindra finds this primitive device efficient and stunningly beautiful

ఓ మెకానికల్ పరికరం పనిచేస్తున్న తీరును పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ప్రాచీన కాలంలో, టెక్నాలజీ లేని రోజుల్లో ఈ తరహా యంత్రాలు మనుషుల అవసరాలను ఎలా తీర్చాయన్నది వీడియోను చూస్తే అర్థమవుతోంది. వేగంగా ప్రవహించే చిన్న కాలువలోని నీటి ప్రవాహ మార్గానికి అడ్డంగా చెక్కతో చేసిన చక్రాన్ని పెట్టారు. 

నీటి ప్రవాహ ఒత్తిడికి ఆ చక్రం తిరుగుతుంది. చక్రానికి మరోవైపున ఓ చెక్క ముక్కను ఏర్పాటు చేశారు. దీని సాయంతో మహిళ బియ్యం, ఇతర ధాన్యాలను దంచి, పొడుంగా మార్చే పని చేస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా తన స్పందనను ట్వీట్ రూపంలో తెలియజేశారు. 

‘‘చుట్టూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్న కాలంలో.. ఈ ప్రాచీన మెకానికల్ పరికరం కేవలం సమర్థవంతమైనదే కాదు. ఎప్పటికీ పనిచేసేది. ఎంతో అందమైనది. కేవలం మెషిన్ కాదు. మొబైల్ శిల్పం’’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.  

దీనికి నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ‘‘బియ్యం దంచే ఈ పరికరాన్ని ఒడిశాలో దింకి కుటా రైస్ అంటారు. ఇప్పటికీ చాలా మంది గిరిజన రైతులు దీన్నే వాడుతుంటారు’’ అని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. తమ గ్రామంలోనూ ఇది ఉందని యూపీకి చెందిన మరో వ్యక్తి స్పందించాడు.

More Telugu News