Asaduddin Owaisi: ముస్లింలే ఎక్కువగా గర్భనిరోధక సాధనాలు వాడుతున్నారు.. అసలైన భారతీయులు ద్రవిడులే: సీఎం యోగికి ఒవైసీ కౌంటర్

  • ఒక సామాజికవర్గం వల్లే జనాభాలో అసమతుల్యత అన్న యోగి
  • భారత మూలవాసుల్లో చైతన్యం కల్పిస్తామని వ్యాఖ్య
  • గిరిజనులు, ద్రవిడులు మాత్రమే అసలైన మూలవాసులు అన్న ఒవైసీ
Dravidians are original Indians says Asaduddin Owaisi

వచ్చే ఏడాది చైనా జనాభాను మన దేశ జనాభా దాటబోతోందంటూ ఐక్యరాజ్యసమితి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, గత ఐదు దశాబ్దాలుగా జనాభా నియంత్రణ కార్యక్రమాలు మన దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని... అయితే ఈ కార్యక్రమంలో అందరి భాగస్వామ్యం సమానంగా ఉండాలని చెప్పారు. ఒక సామాజికవర్గం జనాభా నియంత్రణను సరిగ్గా పాటించడం లేదని.. ఇదే జనాభా అసమతుల్యతకు దారి తీస్తోందని తెలిపారు. భారత మూలవాసుల్లో చైతన్యాన్ని కల్పించి, జనాభాను నియంత్రిస్తామని చెప్పారు. 

ఈ క్రమంలో, యోగి వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. మన దేశంలో జనాభా నియంత్రణ సాధనాలను ఎక్కువగా వాడుతున్నది ముస్లింలేనని ఆయన అన్నారు. ముస్లింలు భారతదేశ మూలవాసులు కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయం గురించి మనం వాస్తవాలను, నిజాలను చూసినట్టయితే... మన దేశ అసలైన మూలవాసులు గిరిజనులు, ద్రవిడ జాతి పౌరులు మాత్రమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

యూపీ విషయానికి వస్తే 2026-30 నాటికి ఎలాంటి చట్టం లేకుండానే... మనం లక్ష్యంగా పెట్టుకున్న జననాల రేటును సాధించవచ్చని ఒవైసీ అన్నారు. మన దేశంలో 2016లో జననాల రేటు 2.6 శాతంగా ఉంటే... ఇప్పుడు అది 2.3 శాతానికి తగ్గిందని చెప్పారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలోనే జననాల రేటు తక్కువగా ఉందని అన్నారు.

More Telugu News