అమెరికాలో రూ.355 కోట్ల భారీ కుంభకోణం... భారత సంతతి వ్యక్తి అరెస్ట్

Indian origin man arrested in US
  • బోగస్ టెక్ కంపెనీలు ఏర్పాటు చేసిన నీల్ చంద్రన్
  • పెట్టుబడులు పెట్టాలంటూ ప్రజలకు ఆహ్వానం
  • అధిక లాభాలు వస్తాయని నమ్మబలికిన నీల్
  • అసలుకే ఎసరు రావడంతో పోలీసులకు ఫిర్యాదులు
అమెరికాలో భారీ స్కాంకు పాల్పడిన భారత సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెవాడాలోని లాస్ వేగాస్ లో నివసించే నీల్ చంద్రన్ (50) భారత సంతతి వ్యక్తి. టెక్ ఎంటర్ ప్రెన్యూర్ గా చెప్పుకునే నీల్ చంద్రన్ ఘరానా మోసానికి తెరదీశాడు. విర్సే అనే మాతృసంస్థ కింద ప్రీ వీఐ ల్యాబ్, వీడై ఇన్ కార్పొరేటెడ్, వీఐ డెలివరీ ఇన్ కార్పొరేటెడ్, వీఐ మార్కెట్ ఇన్ కార్పొరేటెడ్, స్కేలెక్స్ యూఎస్ఏ ఇన్ కార్పొరేటెడ్ తదితర వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులు పెడితే, అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికాడు. 

దాదాపు 10 వేల మంది నుంచి రూ.355 కోట్ల వరకు వసూలు చేశాడు. తన సంస్థలను అత్యంత సంపన్నులు కొనుగోలు చేయబోతున్నారని, తద్వారా కళ్లు చెదిరే రాబడి సొంతమవుతుందని ప్రజలను ప్రలోభాలకు గురిచేశాడు. అయితే, ఎంతకీ లాభాలు రాకపోవడమే కాదు, తమ అసలుకే ఎసరు రావడంతో పెట్టుబడులు పెట్టినవారు లబోదిబోమన్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు నీల్ చంద్రన్ ను అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అసలు, నీల్ చంద్రన్ సంస్థలను కొనుగోలు చేసేందుకు ఏ సంపన్నులు ముందుకు రాలేదని, అంతా బోగస్ అని తేలింది. వసూలు చేసిన సొమ్ములో చాలా భాగాన్ని నీల్ చంద్రన్ ఇతర వ్యాపారాలకు మళ్లించాడని, అంతేకాకుండా, లగ్జరీ కార్ల కొనుగోలుకు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు ఉపయోగించాడని వెల్లడైంది. దాంతో అతడిపై పలు అభియోగాలు మోపిన పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు. అతడి నేరాలు నిరూపణ అయితే జీవితకాలం జైల్లో ఉండాల్సి ఉంటుంది.
Go Back to Shorts
Neil Chandran
Fraud
Arrest
USA

More Telugu News