YSRCP: సీఎంకే పేరొస్తోంది... ఎమ్మెల్యేల‌కు ఏ పేరూ రావ‌ట్లేదు: వైసీపీ ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి

  • ఒంగోలులో ప్ర‌కాశం జిల్లా వైసీపీ ప్లీన‌రీ
  • హాజ‌రైన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు
  • బిల్లులు విడుద‌ల కావ‌డం లేదన్న ఎంపీ మాగుంట‌
  • ద‌ర్శిలోనే రూ.100 కోట్ల ప‌నులు చేశామన్న మ‌ద్దిశెట్టి
  • అప్పులు చేసి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నామ‌ని ఆవేద‌న‌ 
ysrcp mla maddisetty venugopal comments on bill for government works

ఏపీలో అధికార పార్టీ వైసీపీ జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నిర్వ‌హిస్తున్న ప్లీన‌రీల్లో ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు త‌మ‌లోని ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కుతున్నారు. ఇందులో భాగంగా ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ బుధ‌వారం ఒంగోలులో జ‌రిగిన జిల్లా ప్లీన‌రీలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బ‌ట‌న్ నొక్కి నిధులు విడుద‌ల చేస్తున్న సీఎం జ‌గ‌న్‌కు మాత్ర‌మే పేరొస్తోంద‌న్న ఆయ‌న‌... ఎమ్మెల్యేల‌కు ఏ పేరూ రావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ప్లీన‌రీకి హాజ‌రైన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ చేసిన ప‌నుల‌కు బిల్లులు రాక పార్టీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు. బిల్లులు మంజూరు చేసి కార్య‌క‌ర్త‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని ఆయ‌న కోరారు. అనంత‌రం మాట్లాడిన మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌.. .ప్ర‌భుత్వ ప‌నులు చేసిన కార్య‌క‌ర్త‌లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నార‌న్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అప్పులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనే రూ.100 కోట్ల విలువైన ప‌నులు చేశామ‌ని మ‌ద్దిశెట్టి తెలిపారు. ఆ ప‌నుల‌కు బిల్లులు రాక‌పోవ‌డంతో కార్య‌కర్త‌లు ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళితే స‌మ‌స్య‌ల‌పై అడుగుతున్నార‌న్న మ‌ద్దిశెట్టి.. గ‌డ‌ప లోప‌ల ఉన్న వారు బాగున్నార‌ని, గ‌డ‌ప బ‌య‌ట మాత్రం ప‌రిస్థితి బాగా లేద‌ని వ్యాఖ్యానించారు. 

బ‌టన్ నొక్కి డ‌బ్బులు వేస్తుంటే సీఎంకు పేరు వ‌స్తోంద‌న్న ఎమ్మెల్యే.. ఎమ్మెల్యేల‌కు ఏ పేరూ రావ‌డం లేద‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ఈ సంద‌ర్భంగా క‌ల్పించుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి.. సీఎం జ‌గ‌న్‌కు కొన్ని ప్రాధాన్యాలు ఉన్నాయ‌ని, స‌మ‌స్య‌ల‌న్నీ త్వ‌ర‌లోనే ప‌రిష్కారం అవుతాయ‌ని స‌ర్ది చెప్పే య‌త్నం చేశారు.

More Telugu News