Tollywood: ‘జనసేన’లోకి వెళ్తున్నా: సినీ నటుడు పృథ్వీ

moving into Janasena says tollywood actor Prudhvi Raj
షార్ట్స్‌లో చూడండి
వైసీపీలో చేరి ఆపై ఎస్వీబీసీ చైర్మన్‌గా పనిచేసిన నటుడు పృథ్వీ ఆ తర్వాత ఓ వివాదంలో చిక్కుకుని అనూహ్య రీతిలో తిరిగి టాలీవుడ్‌కు చేరారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. తాజాగా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీ పలు సంచలన విషయాలు వెల్లడించారు.

వైసీపీ క్యాంపును ఉగ్రవాద శిక్షణ శిబిరంతో పోల్చిన పృథ్వీ.. ఎస్వీబీసీ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో తాను గొప్పవాడినన్న గర్వం పెరిగిందని, దీంతో ఎవరినీ లెక్క చేయకుండా అనరాని మాటలు అన్నానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

చిరంజీవి, పవన్ కల్యాణ్, చంద్రబాబు వంటి వారిని కూడా అనరాని మాటలు అన్నానని, అయితే, వాళ్లెవరూ సీరియస్‌గా తీసుకోలేదని, సహృదయంతో తనను అర్థం చేసుకున్నారని అన్నారు. తాను తప్పు చేశానని, మీ కాళ్లకు దండం పెడతానని చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబుకు చెప్పానని గుర్తు చేసుకున్నారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, అయిపోయిందేదో అయిపోయిందని, సినిమాల్లో ట్రై చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని వారు తనకు సూచించారని అన్నారు. 2024లో ఓ మంచి బస్సెక్కి సపోర్ట్ చేయమన్నారని చెప్పుకొచ్చారు. 

జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని, ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్‌తో చెబితే తప్పకుండా పిలుస్తానని, ప్రస్తుతానికి సినిమాలు చేసుకోవాలని సూచించారని పృథ్వీ అన్నారు. ఇప్పుడు తనపై తనకు ఓ అంచనా వచ్చిందని, సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. ఇండస్ట్రీలోని పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఎవరినీ నొప్పించకుండా ఉండాలని, వీలైతే సాయం చేయాలని అనుకుంటున్నానని, ఈ జీవితానికి ఇది చాలని పృథ్వీ ఆ షోలో పేర్కొన్నారు.
Go Back to Shorts
Tollywood
Prudhvi Raj
Chiranjeevi
Pawan Kalyan
Chandrababu
Open Heart With RK
Janasena

More Telugu News