population: ప్రతీ తరంలో చైనాలో 40 శాతం జనాభా పతనం: ఎలాన్ మస్క్

  • ముగ్గురు పిల్లల విధానం ఉన్నా జనన రేటు పడిపోయిందన్న మస్క్
  • జనాభా పతనం ముప్పుపై హెచ్చరిక
  • బీబీసీ కథనానికి స్పందనగా ట్వీట్
Elon Musk on population collapse At current birth rates China will lose

భూమండలానికి జనాభా భారం పెరిగిపోతోందంటూ ఒకవైపు పర్యావరణ ప్రేమికులు వాదిస్తుంటే.. మరోవైపు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాత్రం.. సమీప భవిష్యత్తులోనే ప్రపంచం జనాభా క్షీణత ముప్పు ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తున్నారు. ట్విట్టర్ ద్వారా మరోసారి జనాభా క్షీణతపై వ్యాఖ్యలు చేశారు. 

‘‘చాలా మంది ఇప్పటికీ చైనాలో వన్ చైల్డ్ (ఏక సంతానం) విధానమే ఉందని అనుకుంటున్నారు. దంపతులకు ముగ్గురు పిల్లలు అనే విధానం ఉన్నప్పటికీ చైనా గతేడాది అత్యంత కనిష్ఠ జనన రేటును చూసింది. చైనా ఇప్పటి నుంచి ప్రతీ తరంలోనూ 40 శాతం జనాభాను కోల్పోనుంది. జనాభా పతనం’’ అంటూ బీబీసీ కథనానికి స్పందనగా మస్క్ ఒక ట్వీట్ వేశారు.

చైనా జనాభా 1.41212 బిలియన్ నుంచి 2021లో 1.41260 బిలియన్ కు పెరిగినట్టు బీబీసీ పేర్కొంది. కేవలం 4,80,000 మందే పెరిగినట్టు తెలిపింది. 1980 చివర్లో జనన రేటు 2.6 శాతంగా ఉంటే అది 2021 చివరికి 1.5కు తగ్గినట్టు బీబీసీ ప్రస్తావించింది. జనాభా రేటు తగ్గడానికి గత రెండేళ్లో కరోనాపై కఠిన ఆంక్షలు కారణమై ఉండొచ్చన్నది బీబీసీ విశ్లేషణ.

అధిక జనాభాకు మస్క్ మద్దతుదారుగా చెప్పుకోవాలి. ఆయనకు ఎనిమిది మంది సంతానం. ప్రస్తుత ప్రపంచ జనాభా రెట్టింపైనా కానీ, భూమండలానికి వచ్చిన ముప్పేమీ లేదని ఆయన లోగడ ప్రకటించారు. ప్రస్తుత జనాభాకు ఎన్నో రెట్లు పెరిగినా భూమి భరిస్తుందన్నారు. మానవ నాగరికతకు జనాభా క్షీణత ముప్పు పొంచి ఉందన్నది ఆయన అభిప్రాయం.

More Telugu News