Noodles: ఓ న్యాయమూర్తి చెప్పిన మ్యాగీ నూడిల్స్ విడాకుల కథ... ధ్వజమెత్తిన నెటిజన్లు!

Judge shares Noodles divorce case in an event
షార్ట్స్‌లో చూడండి
ఏదో ఒక పూటకు నూడిల్స్ తినడం అయితే ఓకే! కానీ ఉదయం అల్పాహారంలోనూ, మధ్యాహ్న భోజనంలోనూ, రాత్రి డిన్నర్ లోనూ నూడిల్సే తినాలంటే... కష్టమే! కర్ణాటకలోని బళ్లారిలో ఓ భర్త ఈ విషయంలో కోర్టును ఆశ్రయించి విడాకులు పొందాడట. ఈ మ్యాగీ నూడిల్స్ విడాకుల కథను బళ్లారి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి ఎంఎల్ రఘునాథ్ వెల్లడించారు. కొత్త జంటలు ఎలాంటి కారణాలతో విడాకులు కోరుకుంటున్నారో ఆయన ఓ కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా మ్యాగీ నూడిల్స్ విడాకుల ఉదంతాన్ని న్యాయమూర్తి అందరితో పంచుకున్నారు. 

"తన భార్య మూడు పూటలా నూడిల్సే వండి పెడుతోందంటూ ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు. తన భార్యకు నూడిల్స్ చేయడం తప్ప మరే ఇతర వంట రాదని అతడు వాపోయాడు. ఆమె ఏదైనా సూపర్ మార్కెట్ కు వెళితే అక్కడ్నించి తెచ్చేది నూడిల్సేనని వెల్లడించాడు. ఈ కారణంగా భార్యతో తాను కాపురం చేయలేనంటూ అతడు మా కోర్టుకు వచ్చాడు" అని వివరించారు. 

అయితే, జడ్జి రఘునాథ్ వివరణపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. పెళ్లికి ముందే అతడు భార్యకు వంట వచ్చా? రాదా? అనేది తెలుసుకుని ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం జడ్జిని తప్పుబట్టారు. 

వంట చేయడం అనేది కేవలం మహిళల పనే అని జడ్జి అనుకుంటున్నారా? భార్యకు వంట చేతకాకపోతే నువ్వెందుకు వంట చేయడానికి ప్రయత్నించలేదు? అని భర్తను ఆ జడ్జి ఎందుకు అడగలేదు? అంటూ ఓ నెటిజన్ ధ్వజమెత్తారు. ఈ కేసు చూస్తుంటే మనం 1890 నాటి పరిస్థితుల్లో ఉన్నామనిపిస్తోందని మరో నెటిజన్ పేర్కొన్నారు. "భార్యకు కనీసం మ్యాగీ నూడిల్స్ అయినా చేయడం వచ్చు... నీకేం వచ్చు? అని ఆ భర్తను అడగడంలో జడ్జి విఫలం అయ్యాడు అని ఆ నెటిజన్ విమర్శించారు.
Go Back to Shorts
Noodles
Divorce
Couple
Ballari
Karnataka

More Telugu News