KCR: జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎప్పుడొస్తారో చెప్పిన మంత్రి మల్లారెడ్డి

  • దసరా నాడు దేశ రాజకీయాల్లో కేసీఆర్ అడుగుపెడతారన్న మల్లారెడ్డి
  • రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నంత వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎద్దేవా
  • బీజేపీ పాలిత ప్రాంతాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని డిమాండ్
Prayed to Goddess Bhadrakali to make KCR the PM said Minister Malla Reddy

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల దేశవ్యాప్త పర్యటన కూడా చేపట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటుచేయాలన్న గట్టి ప్రయత్నంలో ఉన్నారు. అయితే, జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ కచ్చితంగా ఎప్పుడు అడుగుపెడతారన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. ఈ విషయంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టత నిచ్చారు. 

హనుమకొండ జిల్లా కాజీపేటలో నిన్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక సదస్సుకు హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది దసరా రోజున కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెడతారని మల్లారెడ్డి తెలిపారు. ఆ రోజు వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి వెళ్తారని అన్నారు. ప్రజలు ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. 

ఇక పీసీసీ చీఫ్‌గా రేవంతరెడ్డి ఉన్నంత కాలం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్న మంత్రి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.

More Telugu News