MS Dhoni: మేము ప్లే ఆఫ్స్‌ చేరతామా? లేదా? అనే లెక్కలు వేసుకోవడం లేదు: ధోనీ

  • త‌నకు లెక్కలంటే ఇష్టం ఉండదన్న ధోనీ
  • బాల్యంలోనూ గ‌ణితంలో వెనుకబడిపోయానని వ్యాఖ్య‌
  • ఇప్పుడు నెట్‌ రన్‌రేట్‌ గురించి ఆలోచిస్తే ఉపయోగం లేదన్న ధోనీ
dhoni on victory

ఢిల్లీ క్యాపిటల్స్ తో గ‌త రాత్రి జ‌రిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చెన్నై జ‌ట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాము ప్లే ఆఫ్స్‌ చేరతామా? లేదా? అనే లెక్కలు వేసుకోవడం లేదని, త‌న‌కు లెక్కలంటే ఇష్టం ఉండదని అన్నాడు. 

బాల్యంలోనూ తాను గ‌ణితంలో వెనుకబడిపోయానని, ఇప్పుడు నెట్‌ రన్‌ రేట్‌ గురించి ఆలోచిస్తే ఉపయోగం లేదని తెలిపాడు. త‌దుప‌రి మ్యాచ్ లో ఎలా ఆడాలనేదాని గురించే ఆలోచించాలని, ఒకవేళ తాము ప్లే ఆఫ్స్‌ చేరితే మంచిదేన‌ని, వెళ్లకపోయినా పోయేదేం లేదని చెప్పాడు. ప్లే ఆఫ్స్‌ చేర‌క‌పోతే దీంతో ప్రపంచం ఏమీ అంతరించిపోదని వ్యాఖ్యానించాడు. 

త‌మ జ‌ట్టుకు ఇటువంటి విజయాలు ముందే వచ్చి ఉంటే బాగుండేదని అన్నాడు. గ‌త రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో త‌మ బ్యాట్స్‌మెన్‌ బాగా ఆడారని, జ‌ట్టులోని మిగతా వారు కూడా ఏదో ఒక విధంగా రాణించారని చెప్పాడు. మ్యాచ్ లో విజ‌యం సాధించాలంటే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ముందు భారీ లక్ష్యం ఉంచ‌డం ముఖ్యమైన విషయమ‌ని తెలిపాడు. ఢిల్లీ టీమ్‌లోని బ్యాట్స్‌మెన్ ను నియంత్రించడమూ చాలా ముఖ్యమ‌ని తెలిపాడు. 

గ‌త రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో ముఖేశ్ తో పాటు సిమర్జీత్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారని, ఐపీఎల్ లో మ్యాచ్ లు ఆడేకొద్దీ వారు మరింత మెరుగవుతారని ఆయ‌న అన్నాడు. తాను క్రీజులోకి వెళ్లిన వెంటనే భారీ షాట్లు కొట్టాల‌ని భావించ‌బోన‌ని, అయితే, ఈ మ్యాచ్ లో తక్కువ బంతులు మిగిలి ఉండటంతో ధాటిగా ఆడాల్సి వచ్చింద‌ని తెలిపాడు. మ‌రోవైపు, త‌మ జ‌ట్టు ఓట‌మిపై ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్ మాట్లాడుతూ.. తాము ఈ ఐపీఎల్ లో కొన్ని మ్యాచుల్లో విజయపు అంచుల దాకా వెళ్లి ఓడిపోయామ‌ని అన్నాడు. 

త‌మ‌ జట్టు మెరుగవుతోందని ఇటీవల అనుకున్నాన‌ని, అయితే, అది నిజం కాదని తెలిపాడు. మిగిలిన మూడు మ్యాచుల్లో తాము విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్స్ కు వెళతామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని తెలిపాడు. త‌మ‌ జట్టులో పరిస్థితులు కూడా అంత బాగోలేవని చెప్పాడు. కొవిడ్ కేసులతో పాటు పలువురు ఆటగాళ్లు అనారోగ్యంతో ఉన్నారని, అయితే, ఇవన్నీ త‌మ‌ ఓటములకు కారణాలుగా చెప్పట్లేద‌ని అన్నాడు. ఇకపై మా ఆటగాళ్లు సానుకూల దృక్పథంతో ఉండేలా చూసుకోవాల్సి ఉంద‌ని ఆయ‌న అన్నాడు.

More Telugu News