LGBTQ: ప్రేమించుకున్న ఇద్దరమ్మాయిలు.. ఒప్పుకోని పేరెంట్స్.. పెళ్లికి రక్షణ ఇవ్వాలంటూ పోలీసులను ఆశ్రయించిన జంట

  • పాట్నా మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన జంట
  • ఫిర్యాదు తీసుకోని అధికారులు
  • ఎస్ఎస్పీ దిల్లాన్ సింగ్ ను ఆశ్రయించిన ప్రేమికులు
Two Girls Wanted To Marry seeks Police Protection

ఎల్జీబీటీక్యూ (స్వలింగ సంపర్కుల) హక్కులకు సుప్రీంకోర్టు ఓకే చెప్పినా.. వారికి అనుకూలంగా తీర్పునిచ్చినా ప్రజలు మాత్రం అంగీకరించడం లేదు. అదో అసహజ ప్రక్రియ అని వారిస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా బీహార్ లో జరిగింది. ఇద్దరమ్మాయిలు ఒకరినొకరు ఇష్టపడినా ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. దీంతో వారు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి పోలీసులను ఆశ్రయించారు. తాము పెళ్లి చేసుకుంటామని, రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కానీ, పాట్నాలోని మహిళా పోలీస్ స్టేషన్ వారి కేసును తీసుకోలేదు. దీంతో ఎస్ఎస్పీ మానవ్ జిత్ సింగ్ దిల్లాన్ ను వారు సంప్రదించారు. 

ఇంద్రపురికి చెందిన తనిష్క్ శ్రీ, సహస్రకు చెందని శ్రేయా ఘోష్ లు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. ఈ వ్యవహారం తనిష్క్ శ్రీ తల్లిదండ్రులకు తెలిసి మందలించారు. అయినా ఆమె వినకపోవడంతో ఫోన్ లాగేసుకుని ఇంట్లో బంధించారు. అయితే, సినిమాకు వెళ్తానని చెప్పడంతో ఆమెను తల్లిదండ్రులు వదిలేశారు. ఈ క్రమంలోనే శ్రేయా ఘోష్ తో కలిసి ఆమె పారిపోయింది. 

అయితే, తమ బిడ్డను శ్రేయా ఘోష్ కుటుంబం కిడ్నాప్ చేసిందని ఆరోపిస్తూ పాటలీపుత్ర పోలీస్ స్టేషన్ లో తనిష్క్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే, తామిద్దరం ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని తనిష్క్, శ్రేయా చెబుతున్నారు. స్వలింగ సంపర్కుల చట్టం ద్వారా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబ సభ్యులు తమపై కుట్ర పన్నుతున్నారని, తమ ప్రాణాలకు ముప్పుందని తనిష్క్ ఆందోళన వ్యక్తం చేసింది. 

తమకు 18 ఏళ్లు నిండాయని, తమ బతుకు తాము బతికేందుకు హక్కుందని చెప్పింది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని, శ్రేయను మనస్ఫూర్తిగా మనువాడాలనుకుంటున్నానని తనిష్క్ చెప్పింది. కాగా, తనిష్క్ చెప్పిన మాటలనే శ్రేయ కూడా ఉద్ఘాటించింది. తనిష్క్ తో కలిసి జీవితం పంచుకోవాలనుకుంటున్నానని వివరించింది. 

More Telugu News