Chennai Super Kings: ఓటమికి కారణాలను విశ్లేషించిన మహేంద్రసింగ్ ధోనీ

  • ఇష్టం వచ్చినట్టు షాట్లు ఆడడం కాదన్న ధోనీ 
  • పరిస్థితులను అర్థం చేసుకుని ఆడి ఉండాల్సిందని వ్యాఖ్య 
  • వరుసగా వికెట్లు నష్టపోయామని వాపోయిన వైనం 
MS Dhoni Scrutinises Reason For Chennai Super Kings Seventh Loss In 10 IPL 2022 Matches

ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ప్రతీ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్.. బుధవారం ఆర్సీబీ చేతిలో ఓటమితో అవకాశాలను చేజార్చుకుంది. టాస్ గెలిచిన ధోనీ ఆర్సీబీని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. 173 పరుగులకు కట్టడి చేసినా.. ఛేదనలో చతికిలపడింది. 13 పరుగుల దూరంలో ఆగిపోయి ఓటమి పాలైంది. ఓటమి కారణాలపై సీఎస్కే కెప్టెన్ ధోనీ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు.

‘‘వారిని 170 పరుగులకే కట్టడి చేశాం. అంతా సవ్యంగానే ఉంది. బ్యాట్స్ మెన్ తీరే నిరాశపరిచింది. ఛేదనలో ఉన్నప్పుడు ఏది చేయాలో నీకు తెలియాలి. ఆ సమయంలో స్వభావాన్ని కాస్త నియంత్రణలో పెట్టుకోవాలి. నీదైన శైలిలో షాట్లు ఆడకుండా పరిస్థితులు ఏం కోరుకుంటున్నాయో గమనించుకోవాలి. షాట్ల ఎంపిక మెరుగ్గా ఉండాల్సింది. ఆరంభం చక్కగా ఉంది. చేతిలో వికెట్లు ఉన్నాయి. పిచ్ అనుకూలంగా మారుతోంది. అయినా స్వల్ప విరామంతోనే వికెట్లు నష్టపోయాం’’అంటూ ధోనీ విశ్లేషించాడు. 

6.3 ఓవర్ల వరకు సీఎస్కే ఒక వికెట్ కూడా నష్టపోకుండా 54 పరుగులు చేరుకుంది. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ వికెట్ పతనంతోనే ధోనీ సేన ఓటమి డిసైడైనట్టుంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరారు. మధ్యలో మోయిన్ అలీ ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు.

More Telugu News