Prashant Kishor: మ‌రోమారు రాజ‌కీయ‌ నేత‌గా మార‌నున్న ప్ర‌శాంత్ కిశోర్‌.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆస‌క్తి

  • కాంగ్రెస్ అధినేత్రితో ప్ర‌శాంత్ కిశోర్‌ వ‌రుస భేటీలు
  • పార్టీ నేత‌గా వ్య‌వ‌హ‌రించేందుకే ప్ర‌శాంత్ కిశోర్ ఆస‌క్తి
  • కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తారిక్ అన్వ‌ర్ వెల్ల‌డి
  • నేడు మ‌రోమారు సోనియాతో భేటీ కానున్న వ్యూహ‌క‌ర్త‌
prashant kishor interested to join in congress party

రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల వ్యూహాల‌ను అందించే ప‌నిని కొన‌సాగిస్తున్న ప్ర‌శాంత్ కిశోర్ మ‌రోమారు రాజ‌కీయ నేత‌గా అవ‌తారం ఎత్తేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఒక‌టి, రెండు రోజుల్లోనే ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశాలున్నాయి. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీడ‌బ్ల్యూసీ స‌భ్యుడు తారిక్ అన్వ‌ర్ గురువారం రాత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌ల వ్యూహక‌ర్త‌గా కాకుండా పార్టీ నేత‌గా ఉండేందుకే ప్ర‌శాంత్ కిశోర్ ఆస‌క్తి చూపుతున్నార‌ని అన్వ‌ర్ అన్నారు.

ఇటీవ‌ల వారం వ్య‌వ‌ధిలోనే రెండు ప‌ర్యాయాలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. శుక్ర‌వారం నాడు కూడా ఆయ‌న మ‌రోమారు సోనియాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్ర‌శాంత్ కిశోర్ పార్టీలో చేరే అంశంపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. 

ఇక కాంగ్రెస్‌లో చేరితే కనుక ప్ర‌శాంత్ కిశోర్‌ను పార్టీ ఎన్నిక‌ల జాతీయ కార్య‌ద‌ర్శిగా నియ‌మించవ‌చ్చ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇదే విష‌యాన్ని తారిక్ అన్వ‌ర్ కూడా చెప్పుకొచ్చారు. పార్టీలోకి ప్ర‌శాంత్ కిశోర్ చేరిక‌కు సంబంధించి ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు వ్య‌తిరేకిస్తున్నా.. వారంద‌రినీ ఒప్పించే బాధ్య‌త‌ను సోనియా తీసుకున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే... ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గానే తెర ముందుకు వచ్చిన ప్ర‌శాంత్ కిశోర్... త‌న సొంత రాష్ట్రం బీహార్ రాజ‌కీయాల్లోకి ఇదివ‌ర‌కే ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. బీహార్‌లోని అధికార పార్టీ జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ (జేడీయూ)లో చేరిన ఆయ‌న‌కు ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్ పార్టీ ఉపాధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చారు. అయితే కాల‌క్ర‌మంలో బీజేపీతో జేడీయూ క‌లిసి సాగిన వైనాన్ని జీర్ణించుకోలేని ప్ర‌శాంత్ కిశోర్ త‌న‌కు తానే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. 

More Telugu News