Karnataka: చిచ్చురేపిన వీడియో.. కర్ణాటకలో పోలీస్ స్టేషన్‌పై 1000 మంది దాడి

  • ప్రార్థనా మందిరంపై కాషాయ జెండా ఎగురుతున్నట్టుగా వీడియో
  • దానిని స్టేటస్‌గా పెట్టుకున్న యువకుడు
  • యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్‌పై రాళ్ల దాడి
  • 12 మంది పోలీసులకు గాయాలు
Over 45 arrested and12 cops injured after stones pelted at Hubli police station

స్టేటస్‌గా పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి చివరికి పోలీస్ స్టేషన్‌పై దాడికి కారణమైంది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగిన ఈ ఘటన హింసకు దారితీసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఓ యువకుడు ఓ ప్రార్థనా మందిరంపై కాషాయ జెండాను ఎగురవేస్తున్నట్టుగా ఉన్న ఎడిట్ చేసిన వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ వీడియో ఓ గంటలోనే వైరల్ అయింది. దీంతో అతడిని అరెస్ట్ చేయాలంటూ కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

మరోవైపు, వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్న యువకుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఓ వర్గానికి చెందిన దాదాపు వెయ్యిమంది అర్ధరాత్రి వేళ హుబ్బళ్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలను ధ్వంసం చేశారు. దాడిలో ఓ ఆలయం అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అంతేకాదు, సీఐ సహా 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. 

దీంతో అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపు చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించారు. వివాదాస్పద వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్న యువకుడిని పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన వారిలో 45 మందిని అరెస్ట్ చేశారు. వారి దాడిలో గాయపడిన నలుగురు పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

More Telugu News