Kakani: కాసేపట్లో నెల్లూరులో మాజీమంత్రి అనిల్ సభ... అటు కావలి నుంచి మంత్రి కాకాణి బైక్ ర్యాలీ

  • నెల్లూరు వైసీపీలో కొత్త పరిణామాలు
  • ఇటీవల మంత్రి పదవి కోల్పోయిన అనిల్
  • క్యాబినెట్ లో చోటు సంపాదించిన కాకాణి
  • నేడు గాంధీ బొమ్మ సెంటర్లో అనిల్ సభ
  • కావలి నుంచి నెల్లూరుకు కాకాణి బైక్ ర్యాలీ
  • 1000 మందితో పోలీసుల బందోబస్తు
Latest developments in Nellore YCP politics

నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో వర్గపోరు సాగుతోందా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. మంత్రి అయిన తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి తొలిసారి నెల్లూరు వస్తుండగా, అదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో సభ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సాయంత్రం గాంధీ బొమ్మ సెంటర్ లో అనిల్ సభ జరగనుంది. 

అటు, మంత్రి కాకాణి ప్రస్తుతం కావలి చేరుకున్నారు. ఆయన కావలి నుంచి నెల్లూరు వైసీపీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. కోవూరు, పడుగుపాడు, ఆత్మకూరు బస్టాండు మీదుగా బైక్ ర్యాలీ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో, పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువురు నేతల కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కాగా, నెల్లూరు వైసీపీ రాజకీయాలపై హైకమాండ్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. పార్టీ పెద్దలు అటు మంత్రి కాకాణితోనూ, ఇటు మాజీమంత్రి అనిల్ తోనూ మాట్లాడినట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఇరువురికి స్పష్టం చేసినట్టు తెలిసింది.

More Telugu News