పరిటాల రవి మాదిరే నన్నూ చంపేస్తారేమో!: ఆదినారాయణరెడ్డి
- తనను చంపుతారని తన భార్య భయపడుతోందని వెల్లడి
- విశాఖలో తన తండ్రి హయాంలోనే జగన్కు భూములు
- వాటి కోసమే విశాఖకు రాజధానిని మారుస్తున్నారని ఆరోపణ
- రాజధాని రైతుల పోరాటం విజయం సాధిస్తుందని జోస్యం
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రాజధాని రైతులు సాగిస్తున్న ఉద్యమం గురువారం నాటికి 800 రోజులకు చేరింది. ఈ సందర్భంగా రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆదినారాయణరెడ్డి వైసీపీ పాలనపై తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.
పరిటాల రవి మాదిరే తనను కూడా హత్య చేస్తారేమోనని తన భార్య భయపడుతున్న విషయాన్ని ప్రస్తావించిన ఆదినారాయణరెడ్డి.. భయపడుతూ ఎన్నాళ్లు బతుకుతాం.. ఏదైతే అదే అవుతుంది.. భయపడవద్దు అని ఆమెకు చెప్పానన్నారు. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేసిన జగన్ వ్యూహం వెనుక చాలా కారణాలే ఉన్నాయని ఆయన చెప్పారు.
విశాఖలో జగన్కు భూములు ఉన్నాయని, రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే అక్కడ భూములు కొన్నారని, వాటికి ఇప్పుడు మంచి ధర రావాలన్న ఉద్దేశ్యంతోనే రాజధానిని విశాఖకు తరలించేందుకు జగన్ యత్నిస్తున్నారన్నారు. అయితే అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం తప్పనిసరిగా విజయవంతం అవుతుందని ఆదినారాయణరెడ్డి చెప్పారు.