ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా
- బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ముఖేశ్ వర్మ
- ఏడుకు చేరిన రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య
- ఎన్నికల ముందు బీజేపీకి వరుస ఎదురు దెబ్బలు
పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ కు చెందిన ఎమ్మెల్యే ముఖేశ్ వర్మ. తన రాజీనామా లేఖలో బీజేపీపై వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. వెనుకబడిన తరగతులను బీజేపీ పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. స్వామి ప్రసాద్ మౌర్యను అణగారిన వర్గాల గొంతుకగా ఆయన అభివర్ణించారు. ఆయనే తమ నాయకుడని అన్నారు.
యూపీలో ఐదేళ్ల పాలనలో దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీల గురించి బీజేపీ పట్టించుకోలేదని చెప్పారు. ఈ సామాజికవర్గాలకు చెందిన నేతలకు తగిన గౌరవాన్ని కూడా ఇవ్వలేదని అన్నారు. రైతులు, నిరుద్యోగ యువత, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కారణాల వల్లే తాను బీజేపీని వీడుతున్నానని చెప్పారు. స్వామి ప్రసాద్ మౌర్య వెంట తాను ఉంటానని తెలిపారు. స్వామి ప్రసాద్ మౌర్యతో పాటు పార్టీని వీడిన నేతలంతా కూడా ఓబీసీ వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.