AP Govt: నైట్ కర్ఫ్యూ అమలును వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం

  • ఏపీలో కరోనా తీవ్రం
  • ఇటీవల నైట్ కర్ఫ్యూ ప్రకటన చేసిన ప్రభుత్వం
  • సంక్రాంతి సీజన్ నేపథ్యంలో ఉత్తర్వుల సవరణ
  • ఈ నెల 18 నుంచి రాత్రి పూట కర్ఫ్యూ
AP Govt postponed night curfew

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని భావించింది. అయితే, నైట్ కర్ఫ్యూ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు నేడు తెలిపింది. ఏపీలో సంక్రాంతి తర్వాత రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేసేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దాంతో, ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. కర్ఫ్యూపై ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు సవరణ చేసింది.

దీనిపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే నైట్ కర్ఫ్యూ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. మూడో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. మాస్కులు ధరించకపోతే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా కట్టడిలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు.

More Telugu News