New Delhi: కొత్త ఆంక్షల ఎఫెక్ట్.. ఢిల్లీ మెట్రో ముందు 2 కిలోమీటర్ల మేర బారులు!

  • సగం మందితోనే ప్రయాణాలు
  • స్టేషన్ల ముందు కిలోమీటర్ల కొద్దీ బారులు
  • గంటలకొద్దీ క్యూల్లో నిలబడుతున్న ప్రయాణికులు
  • బస్టాపుల్లోనూ ఇదే పరిస్థితి
Public Queues For Kilometers Waiting For metro In Delhi

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ రాష్ట్రాలు కొత్త ఆంక్షలను విధిస్తున్నాయి. ఢిల్లీలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చేసింది. బస్సులు, మెట్రో, బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు 50 శాతం సామర్థ్యంతోనే నడుస్తున్నాయి. బస్సులు, రైళ్లలో సగం మందినే ఎక్కనిస్తుండడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

మెట్రో స్టేషన్లు, బస్టాపుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం కొన్ని మెట్రో స్టేషన్ల వద్ద 2 కిలోమీటర్ల మేర జనం బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. కరోనా ఉద్ధృతి పెరుగుతున్నప్పుడు ఆంక్షలు పెట్టడం మంచిదే అయినా.. దానికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


కాగా, ఎన్ని ఆంక్షలు పెట్టినా.. చాలా మంది మాస్కులు, భౌతిక దూరం నిబంధనలను గాలికొదిలేశారు. ఇటు ప్రయాణికులూ తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గంటలకొద్దీ క్యూలో నిలబడలేక అవస్థలు పడుతున్నారు. ‘‘గంట నుంచి నేను క్యూలో నిలబడ్డాను. నేను ఇప్పుడు ఆఫీసుకు లేటయ్యాను. ఇలా సగం సగం నడిపే బదులు మొత్తం బంద్ పెట్టి ఉంటే బాగుండేది’’ అంటూ మెట్రో స్టేషన్ ముందు పడిగాపులు కాసిన ఓ ప్రయాణికుడు తన ఆవేదనను వెలిబుచ్చాడు.

ఇంట్లో ఉండి పనిచేస్తుంటే సగం వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, వేరే దారి లేక ఇక ఆఫీసుకు వెళ్తున్నామని మరి కొందరు ప్రయాణికులు చెప్పారు. తన ఇంటి నుంచి స్కూలుకు వెళ్లేందుకు గంట పడుతుందని, ఇప్పటికే అరగంటకుపైగా మెట్రో స్టేషన్ వద్ద వేచి చూస్తున్నానని జ్యోతి అనే టీచర్ చెప్పారు. ఎప్పుడు మెట్రో దొరుకుతుందో.. తానెప్పుడు స్కూలుకు వెళతానోనని ఓ నిట్టూర్పు విడిచారు. మెట్రోను పూర్తిగా మూసేస్తే జనాలు ఇంత టైం వేస్ట్ చేసుకుని ఉండేవారు కాదు కదా? అని ముకేశ్ అనే మరో ఉద్యోగి ప్రశ్నించాడు. ఇటు బస్టాపుల్లోనూ జనాలు పెరిగిపోయారన్నారు.  

More Telugu News