Kerala: డ్రగ్స్ బానిస చేజ్ చేయడం వల్లే యాక్సిడెంట్.. కేరళ మోడల్స్ మృతిలో సంచలన విషయాలు

  • హోటల్ లో అనుచితంగా ప్రవర్తించిన సైజు
  • ఆ తర్వాత మోడల్స్ ను వెంబడించిన వైనం
  • ఆధారాలు ఎందుకు చెరిపేశారంటూ మోడల్ సోదరుడి ప్రశ్న
Kerala Models Died Due To Drugs Addict Chase

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరు కేరళ మోడల్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ డ్రగ్స్ బానిస వారి కారును చేజ్ చేశాడని, అతడి బారి నుంచి తప్పించుకునే క్రమంలో కారు వేగాన్ని పెంచారని, దీంతో డివైడర్ ను ఢీకొని ప్రమాదం జరిగిందని కొచ్చి పోలీస్ కమిషనర్ సి.హెచ్. నాగరాజు తెలిపారు. అక్టోబర్ 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో మిస్ సౌతిండియా అన్సీ కబీర్ (25), మాజీ మిస్ కేరళ అంజనా షాజన్ (26)లు మరణించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ వారి స్నేహితుడు ఆరు రోజుల తర్వాత చనిపోయాడు. కారు నడుపుతున్న మరో స్నేహితుడు అబ్దుల్ రెహ్మాన్ మాత్రమే బయటపడ్డాడు.

ఆ కేసుకు సంబంధించి తాజాగా సంచలన విషయాలను పోలీసులు బయటపెట్టారు. డ్రగ్స్ కు బానిసైన సైజు థంకాచన్ అనే వ్యక్తి వారిని కారులో ఫాలో చేశాడని కమిషనర్ నాగరాజు తెలిపారు. మోడల్స్ పార్టీ చేసుకున్న హోటల్ లోనే సైజు కూడా ఉన్నాడని, అక్కడే ఓ రాత్రంతా తనతో గడపాలంటూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. వారు ఒప్పుకోకపోవడంతో పార్టీ అయ్యాక వారి కారును సైజు వెంబడించాడని చెప్పారు.

కాగా, ఇన్నాళ్లూ ఈ విషయాన్ని దాయడంపై అంజనా షాజన్ సోదరుడు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా పోలీసుల దర్యాప్తును నమ్ముతూనే వచ్చానని, కానీ, ఆధారాలను చెరిపేయాల్సిన అవసరం హోటల్ యజమానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు. అతడిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో మోడల్ అన్సీ ఫ్యామిలీ.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.

More Telugu News