USA: ఆఫ్ఘ‌నిస్థాన్ లోని హోట‌ళ్ల‌లో ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశం: అమెరికా, బ్రిట‌న్ హెచ్చ‌రిక‌

  • ఖాళీ చేయాల‌ని తమ పౌరుల‌కు  అమెరికా, బ్రిటన్ సూచ‌న
  • ముఖ్యంగా సెరెనా హోటల్‌లో దాడి జ‌రిగే ఛాన్స్‌
  • ఆ ప్రాంత ప‌రిస‌రాల్లోనూ ఉండ‌కూడ‌దు
usa britain warn their citizens

ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి అమెరికా ద‌ళాలు వెన‌క్కి వెళ్లిన త‌ర్వాత తాలిబ‌న్లు తాత్కాలిక‌ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఉగ్ర‌దాడులు ఆగ‌డం లేదు. ఇటీవ‌ల ఐఎస్ తీవ్ర వాదులు మ‌సీదులో భారీ దాడి జ‌రిపి ప్ర‌పంచాన్ని ఉలిక్కిప‌డేలా చేశారు. దీంతో కాబూల్‌ లోని హోటళ్లలో ఉన్న తమ పౌరుల‌కు  అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు ప‌లు సూచ‌న‌లు చేశాయి.

ముఖ్యంగా హోట‌ళ్ల‌లో ఉగ్రదాడి జ‌రిగే అవకాశం ఉంద‌ని, హోటళ్లకు దూరంగా ఉండాలని తెలిపాయి. సెరెనా హోటల్‌లో, దానికి దగ్గర్లో ఉన్న అమెరికన్లు వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లాలని అమెరికా అధికారులు ఓ ప్ర‌క‌ట‌న చేశారు. దాడులు పెరిగాయ‌ని హోటళ్లలో ఉండకూడ‌ద‌ని, ముఖ్యంగా కాబూల్‌లోని సెరెనా హోటల్‌ను ఖాళీ చేయాల‌ని బ్రిటన్ ప్రభుత్వం కూడా ప్ర‌క‌ట‌న చేసింది. కాగా, ఆ విలాసవంత‌మైన హోట‌ల్‌లో తాలిబన్లు గ‌తంలో రెండుసార్లు దాడులు జ‌రిపారు.

More Telugu News