KPHB: ఆలుమగల మధ్య గొడవ.. అత్తమామలపై పెట్రోలు పోసి నిప్పంటించే ప్రయత్నం చేసిన భర్త, కేపీహెచ్‌బీలో కలకలం!

  • ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏడాది నుంచే మనస్పర్థలు
  • కోర్టులో పెండింగులో కేసు
  • కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న నిందితుడు!
son in law poured petrol on father in law and mother in law

ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య ఏడాది నుంచే మనస్పర్థలు మొదలయ్యాయి. భర్త తరచూ వేధిస్తుండడంతో భరించలేని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిపై కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా అత్తగారింటికి వెళ్లిన ఆమె భర్త అత్తమామలపై పెట్రోలు పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో వారిద్దరితోపాటు నిందితుడు కూడా స్వల్పంగా గాయపడ్డాడు.

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన యువతిని కరీంనగర్‌కు చెందిన వ్యాపారి సాయికృష్ణ (29) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఏడాది తర్వాతి నుంచే వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. సాయికృష్ణ తరచూ భార్యను వేధించేవాడు. అతడి వేధింపులు భరించలేని ఆమె 2019లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగా, ఆమె అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నెల 9న రాత్రి 9 గంటల సమయంలో అత్తింటికి వచ్చిన సాయికృష్ణ చేతిలో సీసా ఉండడంతో దానిని యాసిడ్ అనుకుని భయపడిన భార్య తన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న మామతో వాగ్వివాదానికి దిగాడు.

అనంతరం సీసాలోని పెట్రోలును ఆయనపై పోసి అగ్గిపుల్ల గీసి అంటించాడు. దీంతో ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన ఆయన భార్య రమాదేవి కూడా స్పల్పంగా గాయపడ్డారు. ఆ వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన రమాదేవి, సాగర్‌రావును పోలీసులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఈ ఘటనలో నిందితుడు సాయికృష్ణకు కూడా గాయాలయ్యాయని, స్నేహితుడితో కలిసి కరీంనగర్ వెళ్లి అక్కడ చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More Telugu News